Listen to this article

ప్రపంచ మేధావి భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్

విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయి సాధ్యం

బస్టాండ్ చౌరస్తా ను అంబేద్కర్ కూడలిగా నామకరణం చేయాలి

దసరా నాటికి పెద్దపల్లిలో బస్సు డిపో ప్రారంభానికి కృషి

9 మంది కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహకం క్రింద 22.5 లక్షల పంపిణీ

అంబేడ్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

జనం న్యూస్, ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తెలిపారు.సోమవారం రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతినీ పురస్కరించుకొని బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మేల్యే చింతకుంట విజయ రమణా రావు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేడ్కర్ చిత్ర పటానికి పూల మాల లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ, ప్రపంచంలోని 102 దేశాల వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, ఇంత గొప్పగా జయంతి వేడుకలు జరుపుకుంటున్న మహనీయుడు అంబేద్కర్ మాత్రమేనని, ప్రతి ఊరు ప్రతి వాడలో , పల్లె పట్టణం అనే తేడా లేకుండా గొప్పగా జయంతి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.1950 జనవరి 26న రాజ్యాంగ ఆమోదం పొంది గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందని, ఎస్సీ ఎస్టీ బీసీలకు, మహిళలకు, కులాలకు మతాలకు అతీతంగా ఓటు హక్కు అంబేద్కర్ కల్పించారని తెలిపారు. అంబేద్కర్ దూర దృష్టితో అనేక సమస్యలను పరిష్కారం చూపుతూ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని అన్నారు. పార్లమెంటులో కూడా అంబేద్కర్ ను పాలక పక్షాలు అవమానించేలా వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు.దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో, రాజకీయ రంగంలో, సామాజిక వేత్త , విద్యావేత్తగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. అంబేడ్కర్ చిన్నతనం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, సమాజంలో ఉన్న కుల వివక్ష, హెచ్చుతగ్గులు తొలగించాలనే ఆశయంతొ ఆయన పోరాడారని అన్నారు. అంబేడ్కర్ చిన్నతనం నుంచి విద్య ప్రాముఖ్యతను గుర్తించి గొప్ప చదువులు చదివారని, విదేశాల్లో అంబేద్కర్ మేధస్సుకు చాలా గొప్ప పదవులు, అవకాశాలు వచ్చినప్పటికీ భారత దేశంలో ఉన్న వెనుకబాటుతనం, అంటరానితనం తొలగించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ తన జ్ఞానాన్ని దేశ అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల జీవితంలో మార్పు తీసుకొని రావడానికి ఉపయోగించారని ఎమ్మెల్యే తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగానే తాము నేడు పదవులు అనుభవిస్తున్నామని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. భారత దేశంలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా రాజ్యాంగం రచించారని, అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకంగా రాష్ట్ర ఏర్పాటు హక్కు కేంద్రం చేతిలో పెట్టారు కాబట్టి మన రాష్ట్రం వచ్చిందని అన్నారు. పెద్దపల్లిలోని బస్టాండ్ చౌరస్తా ను అంబేద్కర్ కూడలిగా నామకరణం చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. దసరా నాటికి పెద్దపల్లి బస్సు డిపో పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.అంతకుముందు సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, అధికారులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ స్వరూప, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి వినోద్ కుమార్, జిల్లా అధికారులు, టి.ఎన్.జి.ఓ. జిల్లా అధ్యక్షుడు బొంకూరీ శంకర్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు, వివిధ దళిత సంఘాల నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.