


జనం న్యూస్,ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ చేసిన కృషిని మరువలేనిదని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ జీవితం నుండి ప్రేరణ పొంది, రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వం, స్వేచ్ఛ మరియు సోదరభావం యొక్క విలువలను నిలబెట్టడానికి వారిని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని, అంబేడ్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు అంబేడ్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి,సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు.