Listen to this article

పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం

ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి ఏర్పాటుకు చర్యలు

మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక

రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

జనం న్యూస్, ఏప్రిల్ 23, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి తో భూ సమస్యల పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి పాల్గొన్నారు. భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, భూ సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం 2025 అమల్లోకి వచ్చిందని, ముందుగా రాష్ట్రంలోని 4 మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని అన్నారు. భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్ల పై భూ భారతి చట్టం ప్రకారం ఆప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం పై కలెక్టర్ వద్ద, కలెక్టర్ నిర్ణయం పై భూమి ట్రిబ్యునల్ వద్ద అపీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. ప్రస్తుతం ధరణి లో ఉన్న భూ రికార్డులు భూ భారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అర్హులైన వారు మన జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని, దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్, భూమి ట్రిబ్యూనల్ లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు. పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు , 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని అన్నారు. భూ భారతి చట్టం పై అవగాహన కల్పించేలా కర పత్రాలను పంపిణీ చేశామని, ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురెష్ , రామగిరి తహసిల్దార్ సుమన్, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.