Listen to this article

జనం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా, ఏప్రిల్22:

రాజకీయ ఒత్తిడి కారణంగానే రెవెన్యూ అధికారులు పోలీసులు నిర్వాసితుల భూములపై బుల్డోజరుతో దాడి చేశారని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం పార్వతీపురం స్థానిక సుందరయ్య భవనంలో పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం బంటువానివలస గ్రామంపై నిర్వాస్తులు నిర్మించుకున్న గోడలను చెట్లను చాలా అధ్వానంగా మండల తహసిల్దార్, పోలీసు యంత్రాంగం పూర్తిగా కూల్చివేసిన సంగతి అందరికీ తెలిసినదేనని, దానిని అడ్డుకునే ప్రయత్నం చేసిన నిర్వాసితులపై 107 కేసులు కూడా పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ దాడిని ఖండిస్తూ సోమవారం భూ నిర్వాసితులందరూ కలెక్టర్ ఆఫీసు వద్దకు వెళ్లి విన్నవించుకున్న విషయం తెలిసినదే. జాయింట్ కలెక్టర్ బయటికి వచ్చి సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ కూడా అందించారని, ఇది ఇంతవరకు జరిగిన ఒక ప్రక్రియ అని అన్నారు. దీనిని ఒక వ్యక్తి సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తూ ఇది చట్టపరంగా న్యాయమైనదేనని, దీనిలో ఎమ్మెల్యే విజయచంద్ర ప్రమేయం ఏమీ లేదని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైనా ఉందా అని అన్నారు. నిర్వాసితుల భూమి కూల్చివేతపై ఎమ్మెల్యే పాత్ర ఉన్నదా లేదా అనేది ఎమ్మెల్యే ఖండించాల్సింది పోయి, ఒక సాధారణమైన వ్యక్తి ఖండించడమంటే ఆ వ్యక్తికి, అధికారులకు ఆత్మరక్షణకు మరో మార్గంలో బాగమేనని వివరించారు. అసలు అధికారులు ఆదివారం అయినప్పటికీ హుటా హుటిన నిర్వాసితుల నిర్మాణం కూల్చివేతకు అంత ఉత్సాహం వెనుక కారణం ఏమిటి, ఏ ఒక్క వ్యక్తి ఒత్తిడి లేకుండానే అధికారులు, పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారా అని అన్నారు. ఇది ఈనాటి సమస్య కాదని, అధికారులు చెప్పినట్టు చాలా ఏళ్ల సమస్యగా తేర్చితే, ఆదివారం గుర్తు రావడం ఏమిటని, ఇంతకన్నా ముందు ఎప్పుడు గుర్తుకు రాలేదా అని అన్నారు. అధికారుల నిజాయితీని మేము గౌరవిస్తున్నామని, ఇదే నిజాయితీతో గడిచిన పదేళ్ల కాలంలో జిల్లాలో గల చెరువులు భూ కబ్జాలకు ఎన్ని గురైనవి, ఎన్నింటిని పరిష్కారం చేశారో బహిరంగంగా తెలపాలని అన్నారు. దేవునిబంధ, వరహాలగెడ్డ ఇలా అనేక రకాల గెడ్డలు మొత్తం కబ్జాలకు గురైన విషయం అధికారులకు తెలియదా, లేక రాజకీయ హస్తం ఉందన్న కారణంగా విడిచి పెట్టేశారా అని ప్రశ్నించారు. బంటువానివలసలో నిర్వాసితుల భూమి ఒక వ్యక్తి చెప్పినట్టు కబ్జాకగురైనట్లయితే, ఆనాటి ఎమ్మార్వో అధికారికంగా ఏ విధంగా పట్టాలను జారీ చేయగలరు, అది అబద్ధం అని రుజువు చేయగలిగితే, తోటపల్లి నిర్వాసితులకు ఇచ్చిన పట్టాలన్నీ కూడా అబద్ధమేన మరీ, దీనికి రాజకీయ అధికార నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఆక్రమణ అని ఎమ్మార్వో ఆర్డీవో కలెక్టర్ స్థాయి అధికారులు తేల్చి చెప్పాలే గాని ఈ భూమితో ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి చెప్పడం వెనుక రహస్యం లేదనే విషయం నమ్మశకం కానిదని అన్నారు. కమ్యూనిస్టులను తప్పుబడుతూ అనేక దుర్బస్లాడడం సమంజసం కాదని, ఆ వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు హక్కు ఇచ్చారనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని తేల్చి చెప్పారు. ఒక తహసీల్దారు మండలంలో ఎవరైనా అక్రమంగా చెట్లను కూలగొడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అంతే తప్ప అదే తహసిల్దారు ఏ చట్ట ప్రకారంగా చాలా ఆప్యాయంగా పెంచుకున్న మామిడి, కొబ్బరి, అరటి, సపోటా, జామ చెట్లను కుల్లగొడతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన సంఘటన సందర్భంలో ఎమ్మార్వోకు ఆ భూమికి సంబంధించిన పట్టాలు చూపించినప్పటికీ పైనుంచి వచ్చిన రాజకీయ అధికారుల ఒత్తిడి కారణంగానే అది తప్పు అని తెలిసిన తప్పని పరిస్థితుల్లో కూలగొట్టడం తప్పలేదని, ఈ దారుణాతి పరిస్థితికి కారణమైన ఎమ్మార్వో, సంబంధిత అధికారుల పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు రాజకీయ నాయకుల అక్రమ పనులకు తలోగ్గి పని చేయొద్దని, దానివల్ల నష్టపోయేది అధికారులేనని, ఇప్పటికైన రాజకీయ నాయకుల కుట్రలను బట్టబయలు చేయాలని, రాజకీయ మోసపు మాటలకు బలికావద్దని విజ్ఞప్తి చేశారు. ఇది ఒక వ్యక్తి సమస్య కాదని, తోటపల్లి నిర్వాసితుల పోరాట ఫలితమని, దానిని అక్రమంగా అందుకునే ప్రయత్నం చేపడితే మరో తోటపల్లి పోరాటం జరగడం ఖాయమని తేల్చి చెప్పారు.