

రైతులు పశువులను మేతకు బయటకు వదలవద్దు
రోడ్డు ప్రమాదాల నివారణకు మండల రైతులు సహకరించాలి
ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ ఏప్రిల్ 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
మునగాల మండల పరిధిలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పలు గ్రామాల రైతులు తమ పశువులను, గేదెలను,మేతకు వదలకుండా ఇంటి దగ్గరే మేపుకోవాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ రైతులకు ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పశువులు, గేదలు జాతీయ రహదారి పైకి రావడం వల్ల గత మూడు రోజుల నుంచి జాతీయ రహదారిపై మూడు,నాలుగు రోడ్డు ప్రమాదాలు జరిగాయని, రైతులు పశువులు గేదెలను మేతకు వదలకుండా ఇంటి దగ్గరే వాటికి మేత వెయ్యాలని, జాతీయ రహదారి వెంట పశువులు గేదెలు కనిపించినచో కఠిన చర్యలు తీసుకుంటామని,వాటిని గోశాలకు తరలిస్తామని తెలియజేశారు. జాతీయ రహదారిపై పశువులు గేదెలు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనివల్ల ప్రమాదాలు నెలకొంటున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు రైతులు మండల ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.