

జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం పర్యాటక ప్రాంతానికి పాకిస్తాన్ ముష్కర ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపిన దుశ్చర్యకు నిరసనగా తడ్కల్ లో ర్యాలీ.
జనం న్యూస్,ఏప్రిల్ 28,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో జమ్మూకాశ్మీర్ లోని పహ్లగం పర్యాటక ప్రాంతానికి వెళ్లిన అమాయక హిందూ పర్యాటకులను పాకిస్తాన్ ముష్కర ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపిన దుశ్చర్యకు నిరసనగా ఆదివారం స్థానిక జుమ్మా మజీద్ నుంచి గ్రామ పురవీధుల గుండా సెల్ఫోన్ టార్చిలైట్లతో, కొవ్వొత్తులతో, ఉగ్రవాదుల దిష్టిబొమ్మను ఊరేగింపు చేస్తూ నిరసన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. అనంతరం శివాజీ మహారాజ్ ప్రధాన కూడలిలో మనవ హరంగా ఏర్పడి ముష్కర దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ముష్కరుల దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అమాయకుల పై ఉగ్ర దాడి అమానుషం అని అన్నారు.పహిల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు వదిలిన అమాయక హిందువులకు అశ్రు నయనాలతో నివాళులు అర్పిస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతు ముస్లిం సంఘాల నాయకులు అశ్రునివాళ్లు అర్పించారు.మారణ కాండ సృష్టించిన ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు.ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, ఇందుకు బాద్యులైన పొరుగున ఉన్న దాయాది దేశాలు గట్టి జవాబ్ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఒక వర్గం టూరిస్టులపై ఏరికోరి కిరాతకంగా అమానవియంగా కాల్పులు జరిపి హతమార్చడం దారుణమైన సంఘటన అని అన్నారు.కాశ్మీర్ ఉగ్ర మూకల మారణ కాండలో అమాయక టూరిస్టులను కాల్చి చంపడం దారుణ, హేయనీయమైన,క్రూర చర్య అని తీవ్రంగా ఖండించారు. ఉగ్రమూకల దాడులలో అమాయకులు,కీలక రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు,టూరిస్టులు నెలకొరగడం యావత్ భారతీయులందరిని కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టు దిట్టమైన ఏర్పాటు చేయాలని టూరిస్టులకు భద్రత కల్పించాలని కోరారు.అమానవియ ఘటనను నిరసిస్తూ మానవహారం నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తూ దేశభక్తిని, పెంపొందిస్తామన్నారు.
దేశంలో ఇలాంటి హృదయ విదారకమైన సంఘటనలు జరిగినప్పుడు జాతి యావత్తు ఒకటిగా నిలిచి కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండవలసిన సమిష్టి బాధ్యత మనందరిపై ఉందని,ఇలాంటి అంశాలలో రాజకీయాలకు తావివ్వకూడదని అన్నారు.ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ముస్లిం సంఘాల తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, దేశ పౌరులతో పాటు దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలు, విద్యా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ఈ విపత్కర పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి మద్దతు తెలిపి దేశ సమగ్రతకు భారత జాతి ఐక్యతను చాటాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు,ముస్లిం సంఘాల నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు నాయకులు,యువజన సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
