Listen to this article

విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు

జనం న్యూస్ 29 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరంజిల్లా, పూసపాటిరేగ మండలం చల్లవానితోట గ్రామ పరిధిలో తే. 26-04-2025 దిన జరిగిన
భార్యభర్తల హత్య కేసులో ముద్దాయి అయిన పాండ్రంకి రాజశేఖర్ ను తే. 28-04-2025 దిన ఉదయం 10.30 గంటలకి చోడమ్మ అగ్రహారం గ్రామ జంక్షన్ వద్ద భోగాపురం సిఐ జి.రామకృష్ణ గారు అరెస్టు చేసినట్లుగా విజయనగరం డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్ళగా.. హత్యకాబడిన పాండ్రంకి అప్పలనాయుడు, పాండ్రంకి జయమ్మ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు కలరు. కుమార్తె రాధ కుమారిని ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం చేసినట్లు. వివాహ సమయంలో అప్పలనాయుడు వారి కుమార్తె పేరున 20 సెంట్లు భూమిని వ్రాసి ఇవ్వగా, ఇంకనూ 70 సెంట్లు భూమి వారి పేరున కలదు. కుమారుడు పాండ్రంకి రాజశేఖర్ కు ఊరిలో రూ.12లక్షలు వరకు అప్పులు ఉండగా, వాటిని తీర్చేందుకు సందరు భూమిని అమ్ముదామని తల్లిదండ్రులను వేధిస్తుండేవాడు. ఈ విషయమై గ్రామ పెద్దలు వద్ద పంచాయతీ పెట్టగా, సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇరువురి మద్య భేదాభిప్రాయాలు వచ్చి, తరుచూ గొడవలు పడుతుండే వారన్నారు. కుటుంబంలో వచ్చిన విభేదాలు కారణంగా పాండ్రంకి రాజశేఖర్ గత ఏడాది ఆక్టోబరు మాసంలో తల్లిదండ్రులతో విడిపోయి, భార్య, కుమార్తెతో కలసి, రెల్లివలస వెళ్ళిపోయి వేరే ఇంటిలో అద్దెకు
ఉంటున్నారన్నారు. ఇటీవల నిందితుడు పాండ్రంకి రాజశేఖర్ రైతు భరోసా కొరకు సచివాలయంలో దరఖాస్తు చేసేందుకు సంప్రదించగా, భూమికి సంబంధించిన పాస్ బుక్కులు తీసుకొని రావాలని సూచించారు. నిందితుడు పాండ్రంకి రాజశేఖర్ మీసేవలో కాపీలు తీయగా, తన తండ్రి పేరున ఉండాల్సిన 70సెంట్లుకు బదులు 40 సెంట్లు మాత్రమే ఉన్నట్లు, మిగిలిన 30సెంట్లు భూమి డిసెంబరు 2024లో తన సోదరి గంగిరెద్దుల రాధ కుమారి పేరున రిజిస్ట్రేషను చేసినట్లుగా గుర్తించాడన్నారు. ఈ విషయమై తల్లిదండ్రులను ప్రశ్నించగా, దానికి వారు స్పందించక పోవడంతో, గ్రామ పెద్దలు సమక్షంలో మరోసారి పంచాయతీ జరిగిందన్నారు. అయితే, తన సోదరి పేరున వ్రాసిన భూమిని చదును చేస్తే, సమస్య పరిష్కారం అవుతందని భావించిన నిందితుడు పాండ్రంకి రాజశేఖర్ తే.26-04-2025 ది ట్రాక్టరుతో కొంత మట్టిని రోడ్డు నుండి పొలంకు వెళ్ళే దారిలో వేసి, చదును చేసేందుకు జెసిబి పెట్టినట్లుగా తల్లిదండ్రులకు తెలిసి, పాండ్రంకి రాజశేఖర్ గొడవపడినారన్నారు. ఇరువురి మధ్య తగువు జరగడంతో జెసిబి డ్రైవరు చదును చెయ్యకుండా అక్కడ నుండి వెళ్ళిపోగా, కోపోద్రేకుడైన పాండ్రంకి రాజశేఖర్ మీరు చస్తేగాని నా అప్పులు తీరవని, దగ్గరలోని నడుపూరు కల్లంలోగల తన ట్రాక్టరు ఎపి 39వి 1862, ట్రయలర్ నంబరు ఎపి 39యుఎం 5435
తీసుకొని వచ్చి, వారి పొలంలో దించి, తల్లిదండ్రులను చంపేద్దామన్న ఉద్దేశ్యంతో వారిని గుద్దేందుకు ప్రయత్నించగా, అతని తల్లిదండ్రులు భయంతో ప్రక్కనే ఉన్న రంగమ్మగారి మొక్కజొన్న చేనులో దాక్కుండగా, వారిని చంపాలనే దురుద్ధేశంతో మొక్కజొన్న చేనులో ట్రాక్టరును రెండు మూడు సార్లు త్రిప్పి, చేనులో దాక్కున్న తల్లిదండ్రులపై నుండి ట్రాక్టరు పోనివ్వడంతో, వారు మరణించారన్నారు. ఈ విషయంను సోదరి రాధకుమారి పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన భోగాపురం సిఐ జి.రామకృష్ణ, వారి సిబ్బందితో కలసి నిందితుడు పాండ్రంకి రాజశేఖర్ ను ఏప్రిల్ 28న చోడమ్మ అగ్రహారం వద్ద అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తున్నామని డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన సిఐ రామకృష్ణ, ఎస్ఐ దుర్గా ప్రసాద్ మరియు సిబ్బందిని విజయనగరం డిఎస్పీ
ఎం.శ్రీనివాసరావు అభినందించారు. ఈ మీడియా సమావేశంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం సిఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్ఐ ఐ.దుర్గా ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.