

జనం న్యూస్ 1-5-2025 ముమ్మిడివరం ప్రతినిధి
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధే సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్య వైశ్యుల కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ సహా పలువురు డైరెక్టర్లు కలిసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఆర్థికంగా, రాజకీయంగా కూడా పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. 2018-19లో ఆర్యవైశ్యుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.30 కోట్ల మేర నిధులు కేటాయించారన్నారు. 2024-25, 2025-26 బడ్జెట్లో ఆర్యవైశ్యులకు భారీగా నిధులు కేటాయించారన్నారు. ఆర్యవైశ్యుల్లోని పేదలకు ఆర్థిక భరోసా కల్పించడానికి సహకార క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలో ఏపీ ఆర్యవైశ్య కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మాదిరిగా ఏపీ ఆర్యవైశ్య కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటిని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఏపీ ఆర్యవైశ్య కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఆర్యవైశ్యులకు రుణ సదుపాయం కల్పించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఎస్ఎంఈలో భాగంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో ఆర్యవైశ్యులకు పెద్దపీట వేయబోతున్నామన్నారు. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ సభ్యులు తెలిపిన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. అంతకుముందు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ పాలక మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి మంత్రి సవితకు వినతిపత్రమందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, డైరెక్టర్లు కంకటాల రాంబాబు , శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనుచరుడు కొత్త కొండబాబు తదితరులు పాల్గొన్నారు.