Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 3 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలి

AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి CPI సుభాని

ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించిన సీపీఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు

AIYF 66వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చిలకలూరిపేట సిపిఐ కార్యాలయంలో సిపిఐ ఏరియా కార్యదర్శి తాల్లూరి బాబురావు AIYF పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అఖిలభారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర సహాయ కార్యదర్శి సీపీఐ సుభాని మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని, మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని అన్నారు.తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ – దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేశారు.వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో యువత పాత్ర ప్రధానమైనదన్నారు. యువతరంలో ప్రగతిశీల, అభ్యుదయ భావాలను, దేశభక్తి, లౌకిక ప్రజాస్వామిక ఆలోచనలను, నైతిక విలువలను, మానవత్వాన్ని పాదుకొల్పడానికి అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) నిరంతరం కృషి సల్పుతున్నదన్నారు. దేశం కోసం ప్రాణార్పణ చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి అమరవీరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని స్వాతంత్ర్యోద్యమంలో, యువకులను సమీకరించి వీరోచితమైన పోరాటం చేసిందన్నారు, దేశాన్ని పట్టిపీడిస్తున్న తెల్లదొరలను తరిమిందన్నారు. దేశ స్వాతంత్ర్యానంతరం నల్లదొరల దోపిడీని అడ్డుకునేందుకు 1959 మే 3వ తేదీన ఎఐవైఎఫ్ ఆవిర్భవించిందన్నారు. పొత్తిళ్ళలోనే ఎన్నో ఉద్యమ ఆటుపోట్లను ఎదుర్కొని యువజన హక్కుల సాధనకు సామాజికాభివృద్ధికి పాటుపడుతూ యువజనోద్యమాల వేదికగా ముందుకు సాగిందన్నారు. AIYF పనిహక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం, విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దుచేయాలని, అవినీతికి వ్యతిరేకంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్టును రూపొందించి, అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన కర్తవ్యం పాలకులపై ఉంటుందన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మత పోకడలను అనుసరిస్తూ దేశ యువతను పెడదారి పట్టిస్తున్నారని వారు ధ్వజమెత్తారు.ప్రస్తుతం నరేంద్రమోదీ ఆర్ఎస్ఎస్ విధానాలను దేశమంతటా వ్యాప్తి చేయడానికి నీచ కుయుక్తులు పన్నుతున్నాడని ఆరోపించారు. దేశ గతిని మార్చే యువతకు ఉపాది అవకాశాలు కల్పించడంలో మోడీ పూర్తిగా విఫలమయ్యారని వారు అన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందని వారు విమర్శించారు.ఈ కార్యక్రమంలో AIYF ఏరియా, కార్యదర్శి మల్లికార్జున్,పట్టణ కన్వీనర్ రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.