

నేడు కొత్తగూడెం మెడికల్ కళాశాలకు మృతదేహం అప్పగింత
జనం న్యూస్ 03 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమిల్ల శంకర్
కొత్తగూడెం : భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు, కమ్యూనిస్టు పార్టీ యోధులు, ప్రముఖ న్యాయవాది ఆళ్ల గురుప్రసాద రావు (93) అనారోగ్యంతో శనివారం విశాఖపట్నంలో మృతి చెందారు. గురుప్రసాద రావు మృతి పట్ల సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, కొత్తగూడెం తాలూకాకు అనేక దశాబ్డాలపాటు కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వహించి ప్రజలకు, కార్మికవర్గానికి, రైతాంగానికి గురుప్రసాద్ సేవలందించారని, పాల్వంచ, కొత్తగూడెం, పినపాక, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతంలో పార్టీ విస్తారణకు కృషిచేశారన్నారు. న్యాయవాదిగా అన్యాయానికి గురవుతున్న పేదవర్గాలకు అండగా నిలిచారని కొనియాడారు. ఆదివారం గురుప్రసాద్ మృతదేహాన్ని వైద్యవిద్యార్థులకు పరిశోధన నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించనున్నట్లు కూనంనేని తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనార్ధం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవంలో గురుప్రసాద్ పార్ధివదేహాన్ని ఉంచనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలిపారు.