

కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం
ఏడిఏ నూతన్ కుమార్,
జనం న్యూస్,మే 05,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని రైతు సోదరులకు ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభమైంది. మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు.మీ సేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చు.ఆధార్ సంఖ్యతో అనుసంధానమైన పట్టాదారు పాసుపుస్తకంలోని భూయాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపుకార్డును కేటాయిస్తారు.రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్,పంటల బీమా,మౌలిక సదుపాయాల పలు పథకాలు అమలు చేస్తోంది.సరైన గణాంకాలు, ధ్రువీకరణలు,నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడంలేదని కేంద్రం గుర్తించింది.ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని భూములు,పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయి. రైతుల వారీగా పంటల వివరాలు,ఇతరత్రా సమాచారం అందడం లేదు.వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారింది. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీచేయాలని నిర్ణయించింది.ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తిచేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ‘అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో), వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవోలకు శిక్షణ ఇచ్చింది.విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు భూయాజమాన్య పట్టాదారు పాస్పుస్తకం, ఆధార్,ఫోన్ నంబర్తో ఎంఏవో లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవాలి,అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది.దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు.ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జరీ చేసిందని ఏడిఏ అన్నారు.రాష్ట్రంలో పథకాలకు సంబంధం లేదు.రైతుల విశిష్ట సంఖ్యకు రాష్ట్రంలో అమలయ్యే రైతుభరోసా,రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు. రాష్ట్రంలో చట్టబద్ధ భూయాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని ఏడిఏ నూతన్ కుమార్ అన్నారు.