

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ విజ్ఞప్తి
చిలకలూరిపేట పట్టణంలో త్రాగునీటిని అందించే ప్రక్రియలో ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ త్రాగునీరు అందించాలని, ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరానికైనా ఏ స్వచ్ఛంద సంస్థ కైనా అవసరమైన మోతాదులో త్రాగునీటిని సరఫరా చేయాలని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ మున్సిపల్ పాలకులు,అధికారులకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో కొన్ని ప్రార్ధన మందిరాలకు నీటి సరఫరా చేయవద్దని అధికారులు ఆదేశించినట్లు వస్తున్న వార్తలకు సంబంధించి మున్సిపల్ అధికారులు, పాలకులు వెంటనే వివరణ ఇవ్వాలని ప్రజలలో ఎలాంటి అపోహలు తలెత్తకుండా చూడవలసిన బాధ్యత మున్సిపల్ అధికారులు చేపట్టాలని రాధాకృష్ణ సూచించారు. చిలకలూరిపేట పట్టణానికి త్రాగునీరు అందించిన ఘనత ఏఏంజి సంస్థ డైరెక్టర్ డాక్టర్ సురల జాన్ డేవిడ్, జర్మనీ దేశస్థుడు అయిన హెచ్. హెచ్. డైక్ మెన్ శాసనసభ మాజీ సభ్యులు సోమేపల్లి సాంబయ్య గార్ల దని, ఆనాడు చిలకలూరిపేట పట్టణంలోని అన్ని ప్రాంతాలు , బలహీన వర్గాల కాలనీల ప్రజలకు త్రాగునీరు అందించాలనే మహదాశయంతో చేసిన సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి సక్రమంగా త్రాగునీటిని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో త్రాగునీరు వృధా కాకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేసి తగు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం కూడా ఉందని మున్సిపల్ అధికారులను కోరారు. త్రాగునీరు వృధా కాకుండా చూసే విషయంలో పట్టణ ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు త్రాగునీరు వృధా కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తూ చైతన్య పరచవలసిన బాధ్యత అధికారుల మీదనే ఉందన్నారు . ఈ సంవత్సరం వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున నీరు పెద్ద మొత్తంలో ఆవిరి అయ్యే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు నీరు వృధా కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా పట్టణంలో ఉన్న అన్ని బావులను శుభ్రపరచి గృహ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సిద్ధం చేయాలన్నారు . ప్రార్ధనా మందిరాలకు నీటి సరఫరా నిలిపి వేయమని ఆదేశించారనే వార్త నిజం కానప్పుడు ఖండించాలని వారి మనసుల్లో ఉన్న అపోహను పోగొట్టాలని అధికారులను కోరారు. చిలకలూరిపేట ను సమస్యల రహిత పట్టణం గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, ప్రజావసరాల మేరకు త్రాగునీరు సరఫరా జరుగుతుందని మున్సిపల్ పాలకులు , అధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రాధాకృష్ణ సూచించారు.