Listen to this article

జనంన్యూస్. 14.నిజామాబాదు. ప్రతినిధి.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశంనిజామాబాద్, ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన (గుర్తించబడిన) వరి విత్తనాలనే జిల్లా రైతులు వినియోగించేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, హోసింగ్ ఏ.ఈలు, ఎపిఓలు, సహకార శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఖరీఫ్ పంటల సాగు ప్రణాళిక, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తన నిల్వలు, లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ, రేషన్ (ఆహార భద్రత) కార్డుల పరిశీలన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి, వన మహోత్సవం, రాజీవ్ యువశక్తి దరఖాస్తుల పరిశీలన తదితర అంశాల ప్రగతిని కలెక్టర్ ఒక్కో మండలం వారీగా సమీక్షిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఖరీఫ్ లో జిల్లా వ్యాప్తంగా 5.62 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని అంచనా కాగా, అందులో ఒక్క వరి పంటనే 4.37 లక్షల ఎకరాలలో సాగు చేసే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. సన్నాలకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ అమలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి విస్తీర్ణంలో సన్నరకం వరి పంట సాగు చేస్తారని భావిస్తున్నామని అన్నారు. అయితే ప్రభుత్వంచే గుర్తించబడిన సన్న రకాల ధాన్యం మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర రకాల వరి వంగడాలను జిల్లాలోని కొంతమంది రైతులు వినియోగిస్తుండడం వల్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ సందర్భంగా పలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ లో రైతులు ప్రభుత్వంచే గుర్తించబడిన 33 రకాల సన్న రకం వరి వంగడాలను వినియోగించేలా చూడాలన్నారు. సిద్ధి (డబ్ల్యుజిఎల్ 44), కాంపసాగర్ వేరైటి-1 (కేపిఎస్ 2874), సాంబ మసూరి (బిపిటి 5204), జగిత్యాల వేరైటి-3 (జిజిఎల్ 27356), జగిత్యాల వేరైటి-2 (జెజిఎల్ 28545), వరంగల్ సాంబా (డబ్ల్యుజిఎల్ 14), వరంగల్ సన్నాలు(డబ్ల్యుజిఎల్ 32100), జగిత్యాల మసూరి (జెజిఎల్ 11470), పోలాస ప్రభ (జెజిఎల్ 384), కృష్ణ (ఆర్ఎన్‌ఆర్ 2458), మానేరు సోనా (జెజిఎల్ 3828), తెలంగాణ సోనా (ఆర్ఎన్‌ఆర్ 15048), వరంగల్ వేరైటి-1119, కూనారం వేరైటి-2 (కేఎన్ఎమ్ 1638), వరంగల్ వేరైటి-2 (డబ్ల్యుజిఎల్ 962), రాజేంద్రనగర్ వేరైటి-4 (ఆర్ఎన్‌ఆర్ 21278), కూనారం వేరైటి-1 (కేఎన్ఎమ్ 733), జగిత్యాల సన్నాలు (జెజిఎల్ 1798), జగిత్యాల సాంబా (జెజిఎల్ 3844), కరీంనగర్ సాంబా (జెజిఎల్ 3855), అంజన (జెజిఎల్ 11118), నెల్లూరు మసూరి (ఎన్ఎల్ఆర్ 34449), ప్రత్యుమ్న (జెజిఎల్ 17004), సుగంధ సాంబా (ఆర్ఎన్‌ఆర్ 2465), శోబిని(ఆర్ఎన్‌ఆర్ 2354), సోమనాథ్ (డబ్ల్యుజిఎల్ 347), ఆర్ఎన్‌ఆర్ 31479 (పిఆర్‌సి), కేపిఎస్ 6251 (పిఆర్‌సి), జెజిఎల్ 33124 (పిఆర్‌సి), హెచ్ఎమ్‌టి సోనా, మరుటేరు సాంబా (ఎంటీయూ 1224), మరుటేరు మసూరి (ఎంటీయూ 1262), ఎంటీయూ 1271 రకాలకు చెందిన సన్న ధాన్యం వరి వంగడాలను విత్తుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఖరీఫ్ లో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరుగకుండా గట్టి పర్యవేక్షణ జరపాలని, నకిలీ, నాణ్యాతా లోపంతో కూడిన వాటిని విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహకార సంఘాలలో ఎరువుల వాస్తవ నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, రికార్డులలో పేర్కొన్న వాటికి అనుగుణంగానే నిల్వలు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా అన్ని సొసైటీలకు చెందిన సేల్ పాయింట్లు, ఎరువులను నిలువ చేసిన గిడ్డంగులను విధిగా సందర్శించి, ఎరువుల నిల్వల వాస్తవ వివరాలతో కూడిన నివేదికను వారం రోజుల్లోపు సమర్పించాలని కలెక్టర్ గడువు విధించారు. మరో రెండు వారాలలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాల కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కాగా, భూభారతి అమలులో భాగంగా లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కోసం ఆసక్తి, అర్హత కలిగిన వారు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. ఇప్పటికే ప్రైవేట్ సర్వేయర్లుగా పని చేస్తున్న వారు ప్రభుత్వం నుండి లైసెన్సులు పొందేందుకు వీలుగా సీసీఎల్ఏ కమిషనర్ కార్యాలయానికి దరఖాస్తులు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ తహసీల్దార్లకు సూచించారు. రేషన్ (ఆహార భద్రత) కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను, రాజీవ్ యువ వికాసం పథకం కింద దాఖలైన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరీలు పొందిన లబ్ధిదారులు అందరూ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం సీజన్ ప్రాంరంభం కాకముందే నిర్మాణాలు చేపట్టి వేగవంతంగా పనులు జరిగేలా క్షేత్రస్థాయిలో నిశిత పర్యవేక్షణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి, రెండవ వారంలో చేపట్టే వన మహోత్సవం కార్యక్రమానికి అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. మొక్కల పంపిణీ కోసం నర్సరీలలో సరిపడా మొక్కలు అందుబాటులో ఉంచాలని, పంపిణీ చేసే ప్రతి మొక్కను నాటి కాపాడుకునేలా చూడాలన్నారు. పూర్తి స్థాయి లక్షయానికి అనుగుణంగా జిల్లాలో మొక్కల పెంపకం జరగాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.