Listen to this article

జనం న్యూస్ మే 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

తప్పుడు పత్రాలతో అనుమతులు పొందిన బడా నిర్మాణ సంస్థ

హౌసింగ్ బోర్డు భూమిని రోడ్డుగా చూపించి అనుమతులు.

చెరువు బఫర్ జోన్ లోనే నిర్మాణ అనుమతులిచ్చిన జిహెచ్ఎంసి.

కాసులకు కక్కుర్తి పడి సహకరిస్తున్న అవినీతి అధికారులు

చేతులు మారిన కోట్ల రూపాయలు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల విలువ ఆకాశాన్ని తాకడంతో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసే పరిస్థితి ఏర్పడింది. అధికార బలం, ఆర్థిక బలంతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయడానికి కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. బడా నిర్మాణ సంస్థల సైతం అవినీతి అధికారులకు కావలసినంత లంచం ఇచ్చి తమ కు అనుకూలంగా అనుమతులు తీసుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ భూములను ఓ బడా నిర్మాణ సంస్థ తమ వెంచర్ కు రోడ్డుగా చూపించారు. మరో ముగ్గురు అపార్ట్మెంట్ల నిర్మాణదారులు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తూ జిహెచ్ఎంసి నుండి నిర్మాణం అనుమతులు తీసుకున్నారు. నిర్మాణ అనుమతుల విషయంలో జరిగిన కొన్ని అవకతవకలపై “మన తెలంగాణ “ప్రత్యేక కథనం.కెపిహెచ్ బి/మన తెలంగాణ: నిలువ నీడ లేక తల దాచుకోవడానికి చిన్న గుడిసె వేసుకుంటే అక్రమమంటూ హడావిడి చేసే అధికారులు బడా బాబులకు, బడా నిర్మాణ సంస్థల కు దాసోహం అంటున్నారు .కొందరు అవినీతి అధికారులు కాసులకు కక్కుర్తి పడి బడా నిర్మాణ సంస్థలకు అనుకూలంగా అనుమతులు ఇస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. కోట్లు విలువ చేసే కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ స్థలాన్ని అప్రోచ్ రోడ్డుగా చూపించి తప్పుడు పత్రాలతో భారీ నిర్మాణ సంస్థ నిర్మాణ అనుమతులు తీసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వైపు చెరువు బఫర్ జోన్, మరో వైపు అసలు లేని రోడ్డును చూపిస్తూ నిర్మాణ అను మతులకు దరఖాస్తు చేసుకున్న బడా నిర్మాణ సంస్థ కు జీహెచ్ఎంసీ అధికారులు అందిన కాడికి దండుకొని అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హౌసింగ్ బోర్డు అధికారులు తమ హౌసింగ్ బోర్డు స్థలంలో
ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంటే రోడ్డుపై ఫెన్సింగ్ ఏర్పాటు ఏంది…? అని బడా నిర్మాణ సంస్థ నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హౌసింగ్ బోర్డు భూమిని నలబై ఫీట్ల రోడ్డుగా చూపిస్తూ బడా నిర్మాణ సంస్థతో పాటు అక్కడే గతంలో నిర్మించిన మూడు అపార్ట్మెంట్ బిల్డర్లు, తాజాగా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టు నిర్మాణ దారులు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొందినట్లు తెలియడంతో ఆశ్చర్య పోవడం హౌసింగ్ బోర్డ్ అధికారుల వంతైంది.హౌసింగ్ బోర్డు స్థలాన్ని రోడ్డుగా చూపించి అనుమతులుమూసాపేట్ సర్కిల్ పరిధిలోని బాలాజీనగర్ డివిజన్ ఖైత్లాపూర్ సమీపంలో హౌసింగ్ బోర్డు శాఖకు సంబంధించిన స్థలాన్ని గౌతమ్ సాయి నిర్మాణ సంస్థ రోడ్డుగా చూపిస్తూ నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకుంది. ఫైల్ నంబర్ (003143/ జీహెచ్ఎం సీ/1543/ జేపీఎల్1/2023-బీపీ) సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో సెల్లార్, స్టిల్ట్, ఐదు ఫ్లోర్లుగా ఐదు బ్లాకుల నిర్మాణానికి 2023, మార్చిలో దరఖాస్తు చేసుకుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఏప్రిల్ 2024లో అనుమతులు మంజూరు చేశారు. సదరు నిర్మాణ సంస్థ తమ వెంచర్ లో నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఇదిలా ఉండగా తాజాగా హౌసింగ్ బోర్డు అధికారులు తమ భూములను పరిరక్షించుకునేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఖైత్లాపూర్ సమీపంలోని సర్వే నంబర్ 911, 912/ పీ, 913/పీ, 940, 944/ పీ. 941/ ఫ్రీ. 936, 990, 993, 926, 930.934, 939.935,971, 925 సర్వే నంబర్లలో లేఔట్ వేయకుండా మిగిలిన సుమారు 37 ఎకరాల భూమిని పరిరక్షించేందుకు ప్రీఫ్రా బికేటెడ్ వాళ్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సర్వే నంబర్ 939లో భూ మిలో ఫెన్సింగ్ ఏర్పాటు పనులను గౌతమ్ సాయి ఇన్ఫాస్ట్రక్చర్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించడంతో హౌసింగ్ బోర్డు అధికారులు అవాక్కయ్యారు. తమ భూమిని రోడ్డుగా చూపించి సదరు నిర్మాణ సంస్థతో పాటు గతంలో సమీపంలో నిర్మించిన మూడు ఆపార్ట్ మెంట్ బిల్డర్లు జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొందినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉండగా నిర్మాణ సంస్థతో పాటు, గరుడ రెసిడెస్ని అపార్ట్మెంట్ వాసులు కొందరు హైకోర్టును ఆశ్రయించి ఫెన్సింగ్ నిర్మాణ పనులను నిలిపి వేయాలని డబ్ల్యూపీ నంబర్ 10633/2025, 10638/2025 ద్వారా అప్పీలు చేశారు. దీంతో హైకోర్టు ఈ నెల 29 వరకు స్టే విధించింది. మొద్దు నిద్రలో అనుమతులా…? లేక అందిన కాడికి దండుకుని…ఆ పై మూసాపేట్ సర్కిల్ పరిధిలోని ఖైత్లాపూర్ సమీపంలోని సర్వే నంబర్ 988, 991లలోని సుమారు మూడు ఎకరాల స్థలంతో పాటు పక్కనే ఉన్న 937/ఏ. 938/ఏ సర్వే నంబర్లలో నిర్మాణాలు పూర్తయిన రెండు అపార్టుమెంట్లు, చివరి దశ నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ కు జీహెచ్ ఎంసీ అధికారులు నిర్మాణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. కనీసం ఫీల్డ్ విజిట్ చేయకుండా స్థానిక రాజకీయ పలుకుబడి, మామూళ్ల మత్తులో అనుమతులు జారీ చేసినట్లు అర్థమవుతున్నది. హౌసింగ్ బోర్డు శాఖకు చెందిన భూమిని నలబై ఫీట్ల రోడ్డుగా చూపించగానే కండ్లు మూసుకొని అధికారులు అనుమతులు మంజూరు చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటో..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.కాముని చెరువు బఫర్ జోన్ లోనే నిర్మాణానికి అనుమతులు ఖైత్లాపూర్ లోని కాముని చెరువు బఫర్ జోన్ పరిధిలో సర్వే నంబర్ 988, 991లు ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా జీహెచ్ఎంసీ అధికారులు కనీసం చెరువును పరిశీలించకుండా అనుమతులు జారీ చేసినట్లు తెలుస్తుంది. చెరువు బఫర్ జోన్ లో నిర్మాణ సంస్థ నిర్మాణ పనులు చేపడుతుంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఇప్పటి వరకు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం పట్ల పలు అనుమానాలకు కలుగుతున్నాయి. ఓ వైపు బఫర్ జోన్, మరో వైపు హౌసింగ్ బోర్డు భూమిని కబ్జా చేసిన గౌతమ్ సాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నిర్మాణ సంస్థకు జీహెచ్ఎంసీ అధికారులు నిర్మాణ అనుమతులు ఇవ్వడంపై నియోజకవర్గంలో స్థానికులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.హైడ్రా ఎక్కడ…? భయమే లేని బడా నిర్మాణ సంస్థ ఓ వైపు ప్రభుత్వ ఆస్తులను కాపాడుతాం, చెరువులను పరిరక్షిస్తామంటూ హైడ్రా అధికారులు తమ దూకుడు పెంచి నగరంలో పలు చోట్ల కూల్చివేతలు చేపడుతున్నప్పటికీ ఖైత్లాపూర్ లో హైడ్రా అధికారులు చూపు ఇక్కడ కనిపించకపోవడం విచారకరం. మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఏకంగా ప్రభుత్వ రంగ శాఖ అయిన హౌసింగ్ బోర్డు భూమినే కబ్జా చేసి నిర్మాణ అనుమతులు పొందడం చూస్తుంటే హైడ్రా భయం కనిపించడం లేదా..? లేక హైడ్రా తమను ఏమీ చేయలేదన్న ధీమాలో సదరు నిర్మాణ సంస్థ ఉందా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాముని చెరువు బఫర్ జోన్లో నిర్మాణం, హౌసింగ్ బోర్డు భూమిని కబ్జా చేసిన గౌతమ్ సాయి ఇన్ఫ్రాస్టక్చర్స్ నిర్మాణ సంస్థపై హైడ్రా అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.