

జనం న్యూస్ మే 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ పంట దిగుబడి బాగా ఉండాలనుకుంటారు. దీనికి గాను రైతులు విత్తనాలు కొనుగోలుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.జాగ్రత్తలు తీసుకోకపోతే,తేరుకోలేని నష్టాన్ని చూడవలసి వస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని వ్యవసాయాధికారులు చూపిస్తున్నారు.అంతేకాదు అధికారులు,శాస్త్రవేత్తల సలహాలు,సూచనలను ఆచరించినప్పుడే,సాగులో సంపూర్ణ విజయం సాధ్యమవుతుంది.అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడులు సొంతం చేసుకోవచ్చు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే రైతులు అప్రమత్తంగా ఉండి,సాగు మొదలు పెట్టాలి.వర్షాలు కురిస్తే చాలు రైతులలో హడావుడి మొదలవుతుంది. రోహిణి కార్తిలో విత్తనాల కోసం రైతులు విత్తన డీలర్ల దుకాణాల వద్దకు పరుగులు పెడతారు. పలు విత్తన కంపెనీలు డీలర్లకు ఆఫర్లు ప్రకటిస్తాయి. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. ఫోటోలు చూపించి, ఆఫర్ల ఆశ చూపి వివిధ పట్టణాలకు కంపెనీవారు రైతులను తీసుకుపోవడం, గ్రామాల్లో తిరుగుతూ,విత్తన ప్యాకెట్లు బుక్ చేసుకోవడం చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండటం మంచిదని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.గ్రామాలలో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు మీకు అందుబాటులో ఉన్న వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాలి.పక్క జిల్లా,రాష్ట్రాల నుండి తీసుకొచ్చి,ఎవరైనా నకిలీ విత్తనాలు,లూజ్ విత్తనాలు అమ్మినచో సమాచారం ఇవ్వాలి.తొందరపడి లైసెన్స్ డీలర్ దగ్గర కాకుండా,ఇతరుల దగ్గర విత్తనాలు తీసుకొని ఇబ్బంది పడకూడదు.