Listen to this article

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఉగ్ర కోణాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయట పడుతున్న దిగ్భ్రాంతికరమైన విషయాలతో ఇప్పటివరకు విజయనగరానికి పరిమిఆ *మైన ఉలికిపాటు ఇప్పుడు యావత్ దేశానికి విస్తరించింది. ముఖ్యంగా దేశం లోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాదు, ముంబై, బెంగళూరు ప్రజల కంటిమీద కునుకు కరవయ్యేలా చేస్తోంది. ఒక్కరితో మొదలైన ఉగ్రలింకుల అనుమా నాలు, విచారణ కొనసాగుతున్నకొద్దీ తీగలాగితే డొంక కదిలినట్టుగా, దీనివెనుక పెద్ద నెట్వర్క్ నడుస్తున్నట్టు, అసలు ఉగ్రకోణం ఇక్కడ్నుంచే మొదలైనట్టు వెల్లడవడం షాక్ కు గురిచేస్తోంది. వారం రోజుల పోలీసు కస్టడీకి విజయనగరం జిల్లాకోర్టు అనుమతించిన నేపథ్యంలో జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో ఎన్ ఐ ఏ
అధికారులు సిరాజ్, సమీర్ ను ఆదివారం మూడోరోజు కూడా విచారించగా మరిన్ని భయానక విషయాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. పేలుళ్లతో భారీ విధ్వంసానికి రెక్కీ నిర్వహించిన ఐదు పట్టణాల్లో విజయనగరం ఒకటి అని విషయం తెలిసి వణికిన జిల్లావాసులు, ఈ విధ్వంసక ముఠా మరో 20మంది యువకులను మానవ బాంబులుగా మార్చిందని దర్యాప్తు అధికారులు రాబట్టినట్టు జరుగుతున్న ప్రచారంతో కంపించిపోతున్నారు. తెలంగాణ లోని వరంగల్ కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాధర్ తోనూ సిరాజ్, సమీర్ కు దగ్గర” సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో వెళ్లడవడవంతో వారిద్దరి కోసం పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి. ఇక, అహీం అనే సంస్థను సృష్టించిన సిరాజ్.. ఈసంస్థ ద్వారా 20 మానవబాంబులను తయారు చేసినట్టు సమాచారం. వీరికి ఒమన్, సౌదీనుంచి ఆర్థిక సహకారం అందు తున్నట్టు గుర్తించారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కూడా ఉగ్ర మూలాలు ఉన్నా యన్న పక్కా సమాచారంతో పోలీసులు వారికోసం బృందాలవారీగా గాలింపులు ముమ్మరం చేశారు. ఇంకోవైపు, సిరాజ్, సమీర్ మొబైల్ ఫోన్లను అరెస్టు సమయం లోనే స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు, కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ ఉగ్ర ముఠా ఏర్పాటు చేసుకున్న సిగ్నల్ యాప్ లో ఎవరెవరు మాట్లాడిందీ, ఏమి మాట్లాడిందీ విశ్లేషిస్తున్నారు. ఈఉగ్ర ముఠా లో ఇంకెంత మంది మానవబాంబులుగా మారారు, వారి వివరాలు, ప్రస్తుతం వారు ఏ ఏ ప్రదేశాల్లో ఉంటున్నారు అనే అంశాలపైనా కూపీ లాగుతున్నారు. ఉన్నత విద్య అభ్యసించి ఈమార్గం వైపు ఎందుకు మళ్లినట్టు, ఇందుకు ప్రేరేపించిన వారెవరు అని కౌన్సెలింగ్ తరహాలో నిందితులనుంచి కీలక సమాచారం రాబడుతున్నట్టు భోగట్టా. ఇక, హైదరాబాదు ఘోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు సామాజిక మాధ్యమాల ద్వారా కౌంటర్ ఇచ్చిన సిరాజ్ ను ప్రశంసించిన విశాఖకు చెందిన ఆవ్యక్తి ఎవరు? తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అంశాన్ని కూడా దర్యాప్తులో భాగంచేసి కీలక ఇన్ఫర్మేషన్ ను రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. తనను ప్రశంసించిన వ్యక్తి, రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నట్టు సిరాజ్ వెల్లడించిన నేపథ్యంలో ఆదిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాఉంటే, ఉగ్ర లింకులపై జిల్లా పోలీసు యంత్రాంగం వ్యవహరశైలి పై భిన్నాభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికాలం గా ఇక్కడ ఉగ్ర కదలికలను పసిగట్ట లేకపోవడాన్ని కొందరు విమర్శిస్తుండగా, హైదరాబాదు కౌంటర్ ఇంటిలిజెన్స్, ఇంటిలిజెన్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ కారణంగానే ఇది సాధ్యమైన విషయాన్ని ఇంకొందరు గుర్తు చేస్తున్నారు. ఐతే, ఈకేసు విషయంపై అధికారులు మీడియా బ్రీఫ్ ఇచ్చిఉంటే బాగుంటుందని, ప్రజల్లో భయాందోళనలు దృష్ట్యా అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కొందరు భావిస్తుండగా, అత్యంత సున్నితమైన అంశంపై ఎప్పటికప్పుడు బ్రీఫ్ ఇవ్వడం సాధ్యపడదని దర్యాప్తు అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, సిరాజ్ కు ఇక్కడి డీసీసీబీలో ఉన్న ఖాతాలోకి పెద్దమొత్తంలో నిధులు ఎలా వచ్చాయనేదానిపైనా విచారణ నడుస్తోంది. సిరాజ్ కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడే ఖాతాలు ఉండడం, సిరాజ్ పట్టుబడిన మర్నాడే అతని తండ్రి, యూనిఫామ్ లో కాకుండా సాధారణ వ్యక్తిగా డీసీసీబీ కి వెళ్లి సిరాజ్ లాకర్ ఓపెన్ చేసేందుకు విఫల యత్నాలు చేయడం, తన ఖాతాలోని ఎమౌంట్ విత్ డ్రా కు యత్నించడం వంటివి సిరాజ్ కు కుటుంబ సభ్యుల సహకారం ఉందా అనే అనుమానాలకు ఆస్కారమిస్తున్నాయి. మొత్తమ్మీద, దేశంలో మారణహోమాన్ని సృష్టించే ఉగ్ర కుట్రను హైదరాబాద్, ఏపీ పోలీసులు భగ్నం చేయడంతో ప్రజలు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకుంటున్నా, ఈ ముఠా మూలాలను సమూలంగా తుడిచేసేవరకు అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు.