Listen to this article

జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి.. శ్రీనివాస్..

నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషితోనే నగరంలో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు అయిందని పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి తెలిపారు. నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలో అర్వింద్​ పసుపు బోర్డు తీసుకు వస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ మేరకు పసుపు బోర్డు సాధించినట్లు తెలిపారు. పసుపు బోర్డు కోసం ఎంపీ కేంద్ర మంత్రులను కలిశారని పల్లె గంగారెడ్డి గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని సైతం కలిసి నిజామాబాద్​లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. ఆయన కృషితోనే పసుపు బోర్డు ఏర్పాటయిందని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో పసుపు సాగు
దేశంలోని అనేక రాష్ట్రాల్లో పసుపు సాగు చేస్తున్నట్లు గంగారెడ్డి తెలిపారు. అయితే ఎంపీ అర్వింద్​ ప్రత్యేక చొరవ తీసుకొని నిజామాబాద్​లోనే పసుపు బోర్డు జాతీయ కార్యాలయం ఏర్పాటు చేయించారన్నారు. ఇతర రాష్ట్రాలు పోటీ పడినా.. ఎంపీ ఢిల్లీలోనే ఉండి బోర్డు ఇక్కడే ఏర్పాటు అయ్యేలా కృషి చేశారన్నారు. అయితే కార్యాలయం ఏర్పాటైనా భవనం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఖాళీగా ఉన్న నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ను పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించాలని కోరామన్నారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ను పసుపు బోర్డు కార్యాలయం కోసం కేటాయించిందన్నారు. పసుపు రైతుల సంక్షేమమే ధ్యేయంగా తాను పనిచేస్తానని పల్లె గంగారెడ్డి తెలిపారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్​ కులాచారి, స్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.