

జనం న్యూస్ మే 31:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో ఏర్గట్ల మండల వ్యవసాయ, ఉద్యాన మరియు పశు సంవర్ధక శాఖ అదికార బృందం “ఏర్గట్ల ఏపుసం” అను ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం రోజునా బట్టాపూర్ గ్రామ అన్నదాతలకు వానకాలం సాగు సన్నాహకాల పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మండల వ్యవసాయ అధికారి డా. వైష్ణవ్ మాట్లాడుతూ వివిధ వానకాలపంటల్లో వచ్చే చీడ-పిడల నివారణ మార్గాలను వివరించారు అలాగే గ్రామంలో ప్రయోగాత్మకంగా ఎలాంటి పురుగు మందులు మరియు రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో అర ఎకరం వరి సాగు చేయడం కోసం ఒక రైతు ముందుకు రావడం జరిగిందని తెలిపారు. తర్వాత డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ నుండి రైతులకు ఇచ్చే వివిధ రాయితీల గురించి వివరించారు. మండల పశు సంవర్ధక అధికారి డా. రాజలక్ష్మి మాట్లాడుతూ పాడి పశువులకు వానకాలం వచ్చే వ్యాధుల నివారణ చర్యల గురించి వివరిస్తూ శాఖ పరంగా ఉన్న పథకాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమం చివరిలో ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ ట్రైకోడర్మ ను ఉపయోగించి పసుపులో విత్తన శుద్ధి విధానం పైన రైతులకు అవగాహన కల్పించారు.
