Listen to this article

తెలంగాణ ఉద్యమానికి కొత్తగూడెం ప్రాంతం నాంది పలికింది

స్వేచ్ఛాయుత తెలంగాణ ఆవిష్కరించబడాలి

కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

జనం న్యూస్ 02 (కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )

ప్రాణ త్యాగాలతో, సబ్బండ వర్గాల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి సాధించి, నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ అమలైనప్పుడే తెలంగాణ ప్రజలు ఆశించిన తెలంగాణ సాకారం అవుతుందని, ఆ దిశగా పాలకులు తమ కార్యాచరణను అమలు చేయాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, బస్టాండు సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులర్పించారు, సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా జరిగిన సభల్లో కూనంనేని మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తొలి, మలి దశ ఉద్యమానికి కొత్తగూడెం ప్రాంతమే నాంది పలికిందని, ఇక్కడ ప్రారంభమైన ఉద్యమం ప్రతిఒక్కరిలో స్ఫూర్తిని నింపి రాష్ట్ర సాధనకు బాటలు వేసిందన్నారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి స్వరాష్ట్రంకోసం జరిగిన పోరులో అగ్రభాగాన నిలిచింది సిపిఐనేనని, ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చి ప్రజల్లో, కేంద్రంలో కదలిక తెచ్చింది సిపిఐనేనన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రంలో ఆ ఉద్యమ ఫలాలను ప్రజల దరిచేర్చే విధంగా ఉద్యమాలతో ప్రభుత్వాలపై వత్తిడి చేసే భాద్యతను సిపిఐ స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్బంధాలు లేని స్వేచ్చాయుత పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, అలాంటి తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనూ స్వేచ్ఛలేని నిర్బంధాలతో కూడిన పదేళ్ల పాలన నుంచి విముక్తి లభించినప్పటికి ఉద్యమ ఫలాలు ప్రజల దరిచేరాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో నిటిపారుదల, విద్యుత్, మౌలిక సదుపాయాల వంటి అంశాల్లో అభివృద్ధి జరుగుతున్నప్పటికి అది మరింత వేగంపుంజుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా కొత్తగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి నిధులు వెచ్చిస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, రత్నకుమారి, ధనలక్ష్మి, ఎస్ కె ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.