

జనం న్యూస్,జూన్02,
అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం లోని మల్లవరం,ఎం జగన్నాథ పురం గ్రామల్లో ఉపాధి హామీ కార్మికుల పని ప్రదేశంలో ఆందోళన నిర్వహించి బకాయి పడ్డ ఎనిమిది వారాల వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము మాట్లాడుతూ ఉపాధి హామీ కార్మికులు అర్దాకులతో జీవిస్తున్నారని, 8 వారాల నుండి వేతనాలు బకాయి పెట్టడం అన్యాయమని, వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పని చేస్తున్న కార్మికులకు మంచినీరు,మజ్జిగ వంటివి సదుపాయం కల్పించాలని కోరారు.పార, తట్ట, గునపంకి డబ్బులు చెల్లించాలని, వేసవి వేతనం కూడా కలిపి 30% అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కార్మికులకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి, రోజుకి రూ.600 వేతనం చెల్లించాలని అన్నారు.కొలతలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన జీవో ప్రకారంగా రూ.307 రూపాయలు వేతనం చెల్లించాలని, ఉపాధి హామీ కార్మికులందరికీ మండలంలో అన్ని గ్రామాల్లోనూ పని కల్పించాలని డిమాండ్ చేశారు.కార్మికుల రక్షణకు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రతి వారం వేతనాలు చెల్లించాలని,లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు,ఉపాధి హామీ కార్మికులు
పాల్గొన్నారు.