

పంటకి మద్దతు ధర లేదు.. వస్త్రధారనకి గౌరవం లేదు.. పెళ్లికి అంగీకారం లేదు.. చివరికి ప్రాణానికి విలువ లేదు!
జనం న్యూస్ 3జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
మట్టిపై మమకారంతో జీవితాంతం బ్రతికే రైతు చివరికి ఆ మట్టిలో కలిసే దాకా అయినా ఆత్మగౌరవంతో బ్రతికేలా చేయడం అందరి బాధ్యత స్వేదాన్ని ఆయుధంగా మార్చి శ్రమను పెట్టుబడిగా మలిచి సేద్యం అనే యుద్ధంలో నిత్య శ్రామికుడిగా పోరాడుతూ అందరి ఆకలిని తీర్చే అన్నదాతల పట్ల ఈ వ్యవస్థల వైఖరి ఏంటి? రైతు ఉనికే ఈ దేశానికి ధైర్యం. రైతు చేతిలో పుట్టిన విత్తనమే ఈ దేశానికి ప్రాణం. రైతు చేతితో తడిసిన నేలే ఈ దేశానికి అన్నపూర్ణ. కానీ ప్రస్తుత సమాజం రైతును చూసే కోణం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఇది నేటి సమాజపు మానసిక వైకల్యానికి నిదర్శనంగా మారుతుంది . తడిసిన వడ్ల కోసం ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాలలో వడ్లు తడిసి మొలకెత్తిన సంఘటనలు చాలా చోట్ల జరిగాయి, చాలా రోజులుగా వడ్లు కొనుగోలు కేంద్రాలలోనే ఉండడం ఈ దుస్థితికి కారణం రైతుల ఆత్మగౌరవానికి ఆటంకంగా మారింది, ఇలాంటి పరిస్థితులు రైతులకు నిత్యం ఎక్కడో అక్కడ ఎదురవుతూనే ఉన్నాయి ఇది రైతుల పట్ల ప్రభుత్వాల వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి ఇలాటివి పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరగడం ఆమోదించతగినది కాదు వేషధారణ చూసి వెక్కిరించే పరిస్థితి: ఆ మధ్య కాలంలో కర్ణాటకాలో రైతు పంచ కట్టుకొని ఉన్నాడని , బట్టలు మాసి పోయి ఉన్నాయయని మెట్రో రైలులోకి అనుమతించలేదు, అలాగే మరో రైతును షాపింగ్ మాల్ లోని ధియేటర్ లోకి అనుమతించలేదు. ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి ఇవి రైతుల పట్ల సమాజ వైఖరిని తెలుపుతున్నాయి, దేశానికే గర్వకారణమైన అన్నదాతను అగౌరవపరచడం వ్యవస్థ వినాశనానికి దారి తీస్తుంది. యువ రైతులకు పెళ్లి కలగానే మిగులుతోంది :
ఇటీవల కాలంలో వ్యవసాయం చేసే చాలా మంది యువకులకు పెళ్ళిళ్లు కావడం కష్టంగా మారింది వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగించే యువతకు పెళ్లికి అమ్మాయిని ఇవ్వడానికి చాలా మంది ఆమ్మాయి తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు, కారణం ఉద్యోగ భద్రత లేదని, స్థిరమైన ఆదాయం లేదని అమ్మాయిల తల్లిదండ్రులు తిరస్కరిస్తున్నారు. ఇది కేవలం ఒకరి వ్యక్తిగత బాధ కాదు, వ్యవసాయ రంగాన్ని చిన్నచూపు చూసే సమాజపు ఆలోచనా ధోరణికి ఇది నిదర్శనం ఎంత గొప్ప ఉద్యోగం చేసేవాడు అయినా సంపాదించిదంతా చివరికి భూమిపైనే పెట్టుబడి పెడుతున్నాడు, వారి కోసం పిల్లనివ్వడానికి పోటీ పడుతుంటారు, అదే భూమిని నమ్ముకునే జీవితాన్ని సాగించే రైతులకు మాత్రం పిల్లనివ్వడానికి వెనకడుగు వేస్తున్నారు ఇదే ఈ సమాజపు వింత పోకడ..మద్దతు ధరలు లేవు ,అప్పులు పెరిగాయి, చివరికి రైతుల ఆత్మహత్యలే మిగిలాయి. పంటలకు పెట్టుబడులు పెరిగాయి, దిగుబడులు తగ్గాయి, వచ్చిన పంటకు మద్దతు ధరలు లేకపోవడం, వంటి అనేక సమస్యల వలన రైతు అప్పుల ఊబిలో చిక్కుకుపోయి చివరకు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నాడు, ఇది రైతుల పట్ల ప్రభుత్వాల వైఖరికి అద్దం పడుతుంది. రాజకీయ వేదికలపై ‘రైతేరాజు’ అనే మాటలు కాదు క్షేత్ర స్థాయిలో రైతులకు అండగా నిలవడం కావాలి , నాయకుల ఉపన్యాసాలలో రైతును గౌరవించడం కాదు దేశం గర్వ పడేలా రైతును ఆర్దికంగా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ, నాయకుల పై ఉంది. పంట రైతుది, లాభం దళారులది ఎంతో కష్టపడి రైతు పంటను పండిస్తే ఆ పంటలు చివరికి రైతుకు నష్టాన్ని, దళారులకు లాభాలను తెచ్చి పెడుతున్నాయి కారణం ,మార్కెట్ సిండికేట్ అని, కమిషన్ అని, నాణ్యత బాగోలేదని, రేట్ తగ్గువ ఉంది అని రైతులను భయబ్రాంతులకు గురిచేసి కొంత మంది దళారులు రైతుల దగ్గర తక్కువకు కొని మార్కెట్ లో ఎక్కువ ధరలకు అమ్ముకొని లాభాలను పొందుతున్నారు. ఇది రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నది, ప్రభుత్వాలకు వీటిపై నియంత్రణ లేకపోవడం కూడా వీటికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చేపట్టవలసిన అత్యవసర చర్యలు: రైతును రాజుగా మార్చడం అటుంచి కనీసం రైతును ఆత్మగౌరవంతో బ్రతికేలా చేయడం అందరి బాధ్యత రైతును రాజకీయ పార్టీలు చూడాల్సింది ఓటు బ్యాంకు లా కాదు బ్యాంకులో దాచుకున్న విలువైన సంపదలా ..మద్దతు ధరలు ఖచ్చితంగా అమలు చేయాలి. కనీస లాభంతోపాటుస్థిరమైన ధరలను నిర్దేశించాలి. రైతులే నేరుగా వారి ఉత్పత్తులను అమ్ముకునే వీలు కల్పించాలి, దానికి తగినట్టుగా సమీపంలోనే మార్కెట్ యార్డ్స్ నీ నిర్మించాలి. వ్యవసాయంలో పంటలకు, రైతులకు బీమా పూర్తి స్థాయిలో అమలవాలి. బీమా మొత్తం రైతుకు , రైతు కుటుంబ సభ్యులకు స్వయంగా, సమయానికి చెల్లించాలి. తడిసిన ధాన్యాలను, ప్రభుత్వం మద్దతు ధర తో పాటే కోనుగోలు చేయాలి. పెట్టుబడి సబ్సిడీలు నేరుగా రైతుల ఖాతాల్లోకి వేగంగా చెల్లించాలి. రైతు కుటుంబాలకు ఆరోగ్య, విద్య భరోసా పథకాలను సమర్థంగా అమలు చేయాలి. రైతుల సమస్యలను రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయకుండా అమలులో కృషి చేయాలి. రైతులతో నేరుగా భేటీ అయి వారి సమస్యలపై ప్రణాళిక బద్దమైన నివేదికలను తయారు చేసి, అసెంబ్లీలో, పార్లమెంటులో చర్చించాలి. కౌలు రైతులకు పింఛన్లు అందించడం , వృద్ధ రైతులకు ఆర్థిక భరోసాని కల్పించడం చేయాలి. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి, వ్యవసాయంలో పెట్టుబడులను, సాంకేతికతను ప్రోత్సహించాలి, దానికి లాభసాటిగా మార్చాలి. రైతు ప్రాణం చాలా విలువైనది రైతును కాపాడుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. రైతును గౌరవించడం , రైతును ఆత్మగౌరవంతో జీవించేలా చేయడం మన అందరీ బాధ్యత . రైతు ఆత్మగౌరవమే దేశానికి ఆభరణం అన్నదాతల ఆత్మహత్యారహిత భారతాన్ని నిర్మించాలి అదే అసలైన దేశాభివృద్ధి