Listen to this article

జనం న్యూస్ జూన్ 09 నడిగూడెం

మత్తు పదార్థాలకు, గంజాయికి విద్యార్థి యువత దూరంగా ఉండాలని ఎస్సై జి. అజయ్ కుమార్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని అన్నారు.మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల నిర్మూలన సమిష్టి బాధ్యత అన్నారు. యువత డ్రగ్స్ తో క్రమేపీ ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారి, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందని అన్నారు. ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే యువత, ప్రజలు, పోలీసులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడుతేనే విజయం సాధించగలుగుతామని తెలిపారు. యువత ఉత్తమ భవిష్యత్తు వైపు ఆలోచన చేయాలన్నారు.