

పోల్స్ టాక్స్ విధానంతో కేబుల్ టీవీ ఆపరేటర్లకు తీరని అన్యాయం
జనం న్యూస్ జూన్ 10 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
పోల్ టాక్స్ విధానాన్ని రద్దు చేయాలని కేబుల్ టీవీ , ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం ముఖ్య సలహాదారులు ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ , టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడాతూ నూతన పోల్స్ టాక్స్ విధానంతో కేబుల్ ఆపరేటర్లకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థలో కేబుల్ ఆపరేటర్లు అప్పుల పాలు అవుతూ జీవనం కొనసాగిస్తున్నారని ,నూతన పాలసీల ద్వారా వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు. ఆపరేటర్లు పనిచేసే దినసరి కార్మికులకే జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కేబుల్ ఆపరేటర్లకు పోల్ టాక్స్ కొత్త విధానాలు అమలుపరచడం చాలా బాధాకరం అన్నారు. కేబుల్ వైర్ సవరణ కొరకు సమయం ఇవ్వాలని, కేబుల్ ఆపరేటర్లకు క్యాటగిరి 1 క్రింద గుర్తించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేబుల్ ఆపరేటర్లకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించి కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేబుల్ టీవీ , ఇంటర్నెట్ ఆపరేటర్ల సంఘం సలహాదారుడు కావేటి మనోహర్ , కన్వీనర్ సాజిద్ , కో కన్వీనర్ జుంగోని అశోక్ గౌడ్ , సభ్యులు దిలీప్ , కిరణ్ , స్వప్న , సంపత్ , జమీల్ , సాయి కృష్ణ , నగేష్ , చారి, దాసరి రాజు, సత్యం బిసి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలేష్ తదితరులు పాల్గొన్నారు.