

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు
చిలకలూరిపేట మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11 మంది సిబ్బందిపై వేటు పడటం, కొంతమంది పై చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులు కోరడం తో మున్సిపల్ అధికారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి గంగాభవాని పాల్పడిన రూ. 34,34,397 కుంభకోణం ఈ పరిణామాలకు ప్రధాన కారణం.ఈ కుంభకోణం ప్రస్తుతం మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల మెడకు ఉరితాడుగా మారింది.ఈ కుంభకోణంపై సామాన్య ప్రజలకు భరోసా కల్పించేందుకు ఇటీవల చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఎంపీ కృష్ణదేవరాయలు స్పందించారు.ఈ విషయంపై విజిలెన్స్ విచారణకు లేఖ వ్రాయాలని మున్సిపల్ చైర్మన్ను వారు కోరారు. వారి సూచన మేరకు, ఈ నెల 12వ తేదీన చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ రపానీ, డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ విభాగానికి గంగాభవాని చేసిన భకోణంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ వ్రాశారు.అంతేకాకుండా, ఎంపీ కృష్ణదేవరాయులు చిలకలూరిపేట ఎమ్మెల్యే సూచన మేరకు, చిలకలూరిపేట మున్సిపాలిటీలో పారదర్శకత ఉండాలని, ఇటువంటి సంఘటనలు ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు లేఖ రాశారు.చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన 34 లక్షల కుంభకోణం, అలాగే మున్సిపాలిటీలో జరిగిన ఇతర అవకతవకలపై వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని ఆ లేఖలో ఎంపీ కోరారు.ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, నిజాయితీపరులైన ఉద్యోగులు బలవ్వకుండా చూడాలని, చిలకలూరిపేట ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని లక్ష్యంతో చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ కృష్ణదేవరాయలు తమ వంతు కృషి చేస్తున్నారు.ఈ కుంభకోణంపై విచారణ పూర్తి కావడం ద్వారా దోషులు శిక్షించబడి, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మరియు ఉద్యోగులు ఈ విచారణ జరగాలని కోరుకుంటున్నారు.