Listen to this article

యోగాభ్యాసంతో శారీరిక,మానసిక దృఢత్వం

జనం న్యూస్,జున్ 21,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ ఆరోగ్య ఉప కేంద్రంలో ప్రపంచం యోగా దినోత్సవాన్ని శనివారం డాక్టర్ భగవాన్ పాటిల్,హెల్త్ అసిస్టెంట్ సమీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ యోగం అన్నమాట. పవిత్రమైంది.అత్యంత శక్తివంతమైంది. ‘ఎవరైనా ఏదైనా వస్తుందనుకొన్నది రాలేదని బాధపడుతుంటే,నీకా యోగం ఉంటే తప్పక వస్తుందిలే అని అంటుంటారు.యోగం అన్నమాట ఎన్నో అర్ధాలనిస్తుంది. ‘యోగం’అన్న మాటకే ధ్యానం,ఉపాయం, కూడిక,కూర్పు, ప్రయత్నం,కవచం, అపూర్వవస్తుప్రాప్తి అనే అర్థాలున్నాయి. ప్రపంచానికి నీతి,ధర్మం బోధించిన భగవద్గీతలో యోగం అన్న పదానికి నీవు చేసే పనుల్లో నైపుణ్యం పెంచుకో వడమే యోగం అన్న అర్థాన్ని చెబుతుంది అని అన్నారు.మనిషి సాధారణంగా ఇంద్రియాల లోలత్వం కలిగినవాడు.కాని ప్రాణాయామంతో యోగా,భ్యాసాన్ని చేసి మనస్సును నియంత్రణ చేసుకోగలిగితే ఇంద్రియ జయమే కాదు పరబ్రహ్మ సాక్షాత్కారం కూడా పొందవచ్చు అని అన్నారు.కుంభక,రేచక, పూరక నియమాలను పాటిస్తూ చేసేదే ప్రాణాయామం. శరీరంలో ఉన్న వాయువులను క్రమబద్దీకరించుకోవడానికి సూర్యనాడి భేది, శీత్కారీ,భస్త్రిక,భ్రామరి, కపాలభాతి మొదలైన ప్రాణాయామ పద్ధతులను అవలంభిస్తూ మనస్సును నియంత్రించుకోవడమే ప్రాణాయామం అని చెప్పవచ్చు అని అన్నారు.ప్రాణాయామ నిష్ణాతులు కావడానికి, శరీరాన్ని,మనస్సును నియంత్రణ లోకి తీసుకుని రావడానికి ఉపయోగపడేవే యోగాభ్యాసాలు. వీటిల్లో సూర్యనమస్కారాలు ఒక భాగమే అని అన్నారు.ఇంతకు ముందు కాలంలో ప్రతివారు యోగా భ్యాసం చేసేవారు. మొట్టమొదట యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమే అని అన్నారు. యోగాభ్యాసాన్ని ప్రతిరోజు అభ్యసించడానికి శారీరికంగా, మానసికంగా ధృడత్వాన్ని కలిగి ఉండాలంటే కర్మయోగాన్ని అనుష్టించాలని భారతీయం చెబుతుంది.కర్మ యోగాన్ని అభ్యసించే వారి వెంట భగవంతుడు ఉంటాడని అన్నారు.కర్మయోగం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా తన విధులను, బాధ్యతలను నిర్వర్తించడం,దీనినే గీత ‘నీ కర్తవ్యాన్ని నీవుచేయి నీ యోగక్షేమాలు నేను చూస్తా’అని భగవానుడే చెప్పాడని చెబుతుంది. ఇంత మహత్తరమైన యోగ సాధనలో మనో యోగం అనే భాగం చాలా విశిష్టమైంది. అంటే మనస్సును నియంత్రణ లోకి తెచ్చుకోవడమే. ఇందులోనే అనేక రకాలైన అభ్యాసాలున్నాయి. అభ్యాసం కూసు విద్య అన్నదిందుకే.ప్రయత్నం చేస్తూ ఉంటే,ఒకరోజు రానిది నాలుగు రోజుల తర్వాత అదే వస్తుంది. కనుక ఏకాగ్రత సాధించడానికి, మనసును నియంత్రించడానికి యోగాన్ని ఒక అభ్యాసంగా చేసుకోవచ్చు ఇందులో ఉండే నేమ నియమాదుల విషయాన్ని పతంజలి యోగ సూత్రాలు వివరంగా చెబుతాయి. పతంజలి యోగసూత్రాలను అభ్యాసం చేస్తూ ఉంటే మానవుని భవిష్యత్తును తెలుసుకో వచ్చు. అసలు అవ్యక్తుడైన భగవంతుడిని వ్యక్తం చేసుకోవచ్చు. భగవంతుని దివ్య దర్శన భాగ్యాన్ని యోగా వల్ల పొందవచ్చు.వీటిని సాధించే సాధకులను భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా ఖ్యాతి నార్జించిన గాంగేయుడు సాధకులకు 12 యోగ సాధనా మార్గాలను చూపారని మహాభారతంలో చెప్పడం జరిగిందని అన్నారు.ఈవిషయాలన్నీ తెలిసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఐక్యరాజ్యసమితి వారికి యోగా గురించి తెలిపిన తర్వాత ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకునేలా చర్యలు తీసుకున్నారని అన్నారు.జూన్ 21` ప్రపంచమంతా యోగా దినోత్సవాన్ని వైభవంగా ఆచరిస్తారు.ఈ ఒక్క దినోత్సవం నాడు యోగాను గురించి మాట్లాడడం కాక యోగాభ్యాసాన్ని నిత్యజీవితంలో అలవర్చుకుంటే అద్భుతయోగాన్ని అనుభవించవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.