Listen to this article

కె. వేణుగోపాల్, పూర్వ అధ్యక్షులు, ఏపిటిఎఫ్, …..

బిచ్కుంద జూన్ 23 జనం న్యూస్

“పెన్షన్” అనేది సామాజిక భద్రతా పథకం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకునే ఉద్యోగులు వయసు పై పడటం వల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పేదరికంలోనికి వెళ్ళిపోకుండా కాపాడేది. మన దేశం శ్రేయో రాజ్యం. ఈ శ్రేయో రాజ్యంలో ప్రజల శ్రేయస్సును కాపాడే బాధ్యత ప్రభుత్వాలది. అటువంటి ప్రభుత్వాలు ఇటీవల కాలంలో పెన్షన్ భారం నుండి బయటపడడానికి రెండు దశాబ్దాల క్రితం వాజపేయి నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని రద్దుచేసి కొత్తగా జాతీయ పెన్షన్ విధానాన్ని తెచ్చింది. “కొత్త పెన్షన్ వద్దు – పాత పెన్షన్ ముద్దు” అని ఉద్యోగులు, పెన్షనర్లు రెండు దశాబ్దాలుగా ఆందోళన చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదు. మళ్ళీ అదే బిజెపి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి బదులుగా కొత్త పెన్షన్ విధానంలో కొన్ని మార్పులు తెస్తూ 2025 ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అయ్యే “యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని” తెచ్చింది. అంతేకాకుండా పాత పెన్షన్ దారులకు హాని చేసే మరో బిల్లును 2025-2026 ఆర్థిక బిల్లులో భాగంగా గుట్టు చప్పుడు కాకుండా లోక్ సభ ఆమోదించింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఒకవైపు ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే మరోవైపు పెన్షన్ దారులకు నష్టకరంగా ఉండే విధంగా లోక్ సభ ఆమోదించిన ఈ బిల్లును త్వరలోనే రాజ్యసభలో ఆమోదింప చేసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టం అవుతుంది. పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లు గా విడదీయడం ఈ బిల్లులోని ముఖ్య విషయం.ఈ బిల్లులోని సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వ పౌర సేవల (సివిల్ సర్వీసెస్) పెన్షన్ నిబంధనలు 1972 మరియు 2021 మరియు అసాధారణ (ఎక్స్ట్రార్డినరీ) పెన్షన్ నిబంధనలు 2023లో మార్పులు వస్తాయి. కొత్త సవరణల ద్వారా వేతన సవరణల ఫలితంగా వచ్చే లాభాలను వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు పే కమిషన్ సిఫార్సు చేసిన లాభాలు వర్తించవు. పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడూ ఎలా అమలు చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీని ద్వారా పెన్షన్ హక్కులు ఎవరికి వర్తించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఎనిమిదో వేతన సవరణ సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుండి అమలు చేయవలసి ఉంది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా పెన్షనర్లు రెండు గ్రూపులు అవుతారు. అంటే 01-01- 2026 ముందు పదవి విరమణ చేసిన వారు మరియు తర్వాత పదవి విరమణ చేసిన వారు. అట్లే ఈ చట్టం ద్వారా వేతన కమిషన్ అమలు చేసిన తేదీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారం పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే ఆర్థిక లాభం చేకూరుతుంది. మిగిలిన వారికి ఆర్థిక లబ్ధి ఉండదు. వారికి ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ మాత్రమే వస్తుంది. అట్లే ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ 01.03.2025 తేదీన పదవీ విరమణ చేశారు , కానీ కేంద్ర ప్రభుత్వము 8వ వేతన సంఘ సిఫార్సులు 01.01.2026 నుంచి అమలు చేస్తే, ముందు పదవి విరమణ చేసిన వారు ఎవరికి ఈ చట్టం ప్రకారం ఆర్థిక లబ్ది రాదు. అంటే 1.1.26 తదుపరి పదవి విరమణ చేసిన వారికి మాత్రమే వేతన సంఘం సిఫార్సుల లబ్ది వర్తిస్తుంది.పెన్షనర్లను పదవి విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం అసమంజసమని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును నిర్వీర్యం చేస్తూ పెన్షనర్లను పదవి విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తోంది. ఈ బిల్లు చట్టరూపం లోనికి రాగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే, రాష్ట్రాలు కూడా అమలుచేస్తాయి. ఫలితంగా మనం రాష్ట్రంలోని పెన్షనర్లు కూడా తీవ్రంగా నష్టపోతారు .కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు ఈ మార్పు వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. అంటే దాదాపు 70 లక్షల మంది కేంద్ర పెన్షనర్లు, బిఎస్ఎన్ఎల్ లో విలీనమై కేంద్రం నుండి పెన్షన్ పొందుతున్న పాత పెన్షనర్లకు ఇకపై డిఏ తప్ప పెన్షన్ పెరుగుదల ఉండదు. కొంతమంది ఈ చట్టం న్యాయపరంగా చెల్లదని సీనియర్ పెన్షనర్లకు తక్కువ పెన్షన్, జూనియర్లకు ఎక్కువ పెన్షన్ వచ్చే అవకాశం ఉండడం వల్ల పెన్షన్ అనామలీలు ఏర్పడుతాయని అనుకుంటున్నారు. కానీ కేంద్రం బిల్లులో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించింది. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉటంకిస్తూ పెన్షన్ చెల్లింపు అనేది డిఫర్డ్ వేజ్ గా గుర్తిస్తున్నామని, అందుకే పెన్షన్ చెల్లింపు ఉందని పేర్కొంటూనే, 1950, 1960,1970లలో పనిచేసిన ఉద్యోగికి 1986లో పెన్షన్ చెల్లించాల్సిన అవసరం ఏమిటని, ఉద్యోగి పనిచేసిన కాలపు డిఫర్డ్ వేజ్ ను పెన్షన్ గా ఇప్పటికే ఆ పెన్షనర్ కు చెల్లిస్తున్నాము. కనుక పెన్షన్ పెంపుదల అవసరం లేదని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.ప్రభుత్వం పెన్షన్ పెరుగుదల అంశాన్ని మరింత విశదీకరిస్తూ మూడో వేతన సంఘం నుండి ఇప్పటి ఏడవ వేతన సంఘం దాకా పెన్షన్ పెరుగుదలపై విస్తృత చర్చ జరగాలని అన్ని వేతన సంఘాలు చెప్పాయని, కనుక ఇకపై వేతన సంఘం ఏర్పాటు తర్వాత ఆయా సిఫార్సులను అమలు చేయాల్సిన తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికు మాత్రమే వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయని అంతకుముందు రిటైర్ అయిన వారికి కాదని పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లుపై సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండడం, న్యాయ పరిధిలో చాలెంజ్ కు నిలబడే అవకాశాలు తక్కువ ఉండడం ఈ సందర్భంగా గమనించాలి.
లోక్ సభలో ప్రశ్న సంఖ్య 235కు సమాధానం ఇస్తూ 61 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ సివిల్ పెన్షనర్లకు, డిఫెన్స్ పెన్షనర్లకు ఎనిమిదవ వేతన సవరణ కమిషన్ సిఫార్సులను వర్తింప చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీకి భిన్నంగా ఈ సవరణ బిల్లును తేవడం దుర్మార్గం.ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు జీతాల సవరణ జరిగినట్టుగా సామాజిక భద్రతగా చెల్లిస్తున్న పెన్షన్లకు కూడా వేతన సవరణల సందర్భంగా ఇచ్చే లాభాలను వర్తింప చేయడంతో వృద్ధాప్యంలో పెన్షనర్లు ప్రశాంత జీవనం గడపగలుగుతారు. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెన్షన్లలో పెరుగుదల సహాయంగా ఉంటుంది. ఇక నుండి వృద్ధులైన పెన్షనర్లు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు పన్నులను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించింది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి పన్నును 15 శాతానికి తగ్గించింది. దీంతో ఏడాదికి 1.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. కార్పొరేట్లకు బ్యాంకుల్లో పేరుకుపోయిన బకాయిలను 17 లక్షల కోట్ల వరకు మాఫీ చేసింది. కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఇన్సెంటివ్ రూపేణా రెండు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది. పెట్టుబడిదారులను సంతృప్తి పరిచే దానికి ఇంత డబ్బు వినియోగించే ప్రభుత్వాలు పెన్షనర్ల కడుపు కొట్టడానికి సిద్ధం కావడం శోచనీయం. ‘ఉన్ని బట్టలు ఇమ్మంటే ఉన్న బట్టలే పీకేసినట్లు’, నేడు మోదీ ప్రభుత్వం ఉద్యోగుల సమంజస డిమాండ్లనింటినీ బేఖాతరు చేస్తూ, ఓపీస్ పెన్షన్ దారుల హక్కులను కూడా హరించే వేస్తూ ఈ చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. పెన్షన్లకు కోతలు పెట్టే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లతోపాటు, అఖిలభారత స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సంఘటితమై దేశవ్యాప్తంగా సుదీర్ఘ సమరాన్ని సాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది.