

జనం న్యూస్,జూన్ 30,ఆచ్యుతాపురం:
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం స్థలాలు,ఇల్లు, షాపులకు అన్నింటికీ ఒకేసారి నష్టపరిహారం ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ విఎంఆర్డీఏ నిర్వహించిన గ్రామ సభల్లో స్థలాలు,ఇల్లు, షాపులకు టీడీఆర్ బాండ్లు వద్దని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని చేసిన తీర్మానాలను పక్కనపెట్టడం గ్రామ సభలకు విలువలేకుండా చేయడమేనని అన్నారు. నిర్మాణాలకు నష్టపరిహార జాబితాలు తయారుచేయడం, అనుయాయులతో టీడీఆర్ లకు ఒప్పించి నిర్వాసితుల ఐక్యతను దెబ్బతీయాలని ప్రభుత్వం చూస్తోందని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం నగదు కింద బ్యాంకులో జమచేయాలని గత ప్రభుత్వం గజానికి రూ. 15,000 నుండి రూ.25,000 ఇస్తామని నిర్వాసితుల సంతకాలు తీసుకుందని గుర్తుచేశారు. నిర్వాసితులకు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రయోజనం కల్పించకపోగా, మరింత నష్టం తెచ్చిపెడుతోందని అన్నారు. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించకుండానే రోడ్డు విస్తరణ పనులు చేయడం అన్యాయమని అన్నారు. టీడీఆర్ బాండ్లు ఆలోచన మానుకొని నగదు చెల్లింపులు చేయకపోతే నిర్వాసితులతో కలిసి రోడ్డు విస్తరణ పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.రాము, కో కన్వీనర్ కే. రామ సదాశివరావు, రైతు సంఘం నాయకులు కర్రి అప్పారావు,ఎస్ .బ్రహ్మాజీ, బుద్ధ. రంగారావు, శరగడం.జగ్గారావు ,ఆడారి శివ,రామకృష్ణ,సరిస శివ,ఎస్ కనుమనాయడు తదితరులు పాల్గొన్నారు.