

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 14 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో విద్యాసంస్థలకు సమీపంలోని పాన్ షాపుల్లోను, కిరాణా షాపుల్లో సిగరెట్స్, నిషేధిత ఖైనీ, గుట్కాలు, మత్తు కలిగించే ఇతర పొగాకు వస్తువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 13న హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ పేరుతో స్థానిక పోలీసులు, ఈగల్, ఎస్బీ పోలీసులు సంయుక్తంగా విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో పాన్ షాపులు, కిరణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించామన్నారు. ఇందులో భాగంగా గత ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సమీపంలోని పాన్ షాపులు, కిరాణ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా విద్యాసంస్ధలకు 100మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించిన 512మంది వ్యాపారులపై కోటా చట్టం (ది సిగరెట్స్ అండ్ అదర్ పొగాకు ప్రొడక్ట్స్ 2003 చట్టం) ప్రకారం కేసులు నమోదు చేసి, వారిపై రూ.1,13,900/- లను జరిమానాగా విధించామన్నారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పొగాకు ఉత్పత్తులు వలన కలిగే అనర్థాలను తగ్గించేందుకు, విక్రయాలు, ప్రచారంను, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంను నియంత్రించుటకు కోటా చట్టంను 2003లో భారత ప్రభుత్వం అమలులోకి తీసుకొని వచ్చిందన్నారు. విద్యాలయాలకు దగ్గరలో ఉన్న పాన్ షాపుల్లోను,
కిరాణ షాపుల్లో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం వలన విద్యార్థులు వీటిని వినియోగించేందుకు అలవాటుపడి, వక్ర మార్గంలో ప్రయాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొగాకు ఉత్పత్తులను విక్రయించకుండా చర్యలు చేపట్టేందుకు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు స్వస్తి పలకాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ తరహా దాడులు భవిష్యత్తులో మరింత విస్తృతం చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేసారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధిలో గత ఐదు రోజులుగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్స్ ను సంబంధిత సీఐలు, ఎస్ఐలు పాల్గొనగా, సంబంధిత డిఎస్పీలు స్పెషల్ డ్రైవ్స్ ను పర్యవేక్షించారు.