

జనంన్యూస్.నిజామాబాద్, జూలై 27.
గ్రామ పాలన అధికారులు (జీపీఓ), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు కొనసాగిన గ్రామ పాలన అధికారి పరీక్షకు 60 మంది అభ్యర్థులకు గాను, 46 మంది హాజరయ్యారని, 14 మంది గైర్హాజరు అయినట్లు కలెక్టర్ తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించి ఉదయం సెషన్ లో 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరిగిన థియరీ పరీక్షకు 305 మంది అభ్యర్థులకు గాను 271 మంది హాజరయ్యారని, 34 మంది గైర్హాజరు అయినట్లు వివరించారు. కాగా, లైసెన్స్డ్ సర్వేయర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు సెకండ్ సెషన్ లో జరిగే ప్లాటింగ్ పరీక్షను కూడా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గట్టి పోలీసు బందోబస్తు నడుమ ఎలాంటి కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డీ అశోక్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు.