జనం న్యూస్ అక్టోబర్ 01: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలము :
స్వాతంత్ర్యం వచ్చినేటికి 78 సంవత్సరాలు గడిచినా మోర్తాడ్ మండల కేంద్రములో ఇప్పటివరకు సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కేటాయించకపోవడం దళిత వర్గాలలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.మాల, మాదిగ సమాజానికి చెందిన ప్రజలు “మాకు నాయకత్వం వహించే సత్తా లేదా? చదువు, జ్ఞానం లేదా? మేము దళితులమనిఎందుకు పక్కన పెడుతున్నారు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా రిజర్వేషన్ రాకపోవడం వల్ల రాజకీయంగా తాము వెనుకబడి పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితి జనాభా లెక్కల్లో లోపం వల్లా లేక స్థానిక నాయకులు, అధికారుల నిర్ణయాల వల్లా అని గ్రామస్థులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా అఖిల భారత అంబేధ్కర్ యువజన సంఘం నాయకుడు మామిడి రాజు మాట్లాడుతూ, “ఎనిమిది దశాబ్దాలుగా మోర్తాడ్ గ్రామంలో సర్పంచ్ పదవికి ఎస్సీ రిజర్వేషన్ రాకపోవడం స్పష్టమైన వివక్ష. ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. దళితులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.


