50 రూపాయల బదులు 100 రూపాయలు వసూలు
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రిపోర్టర్ ఠాగూర్ అక్టోబర్ 27 :
ఏన్కూరు మండలం పరిధిలో రైతుల వద్ద నుండి వే బ్రిడ్జి నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వాహనానికి 50 రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి అధికారిక ఆదేశాలు లేకుండా ఒకే సారి ఛార్జీలను 100 రూపాయలకు పెంచి రైతులపై భారాన్ని మోపుతున్నారు.రైతులు చెబుతున్నదేమిటంటే — “మేము పంట పండించడానికి ఎంత కష్టం పడుతున్నామో ప్రభుత్వం కూడా తెలుసు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు అన్నీ పెరిగాయి. ఇప్పుడు పంటను అమ్మడానికి తీసుకెళ్లినా వే బ్రిడ్జి వద్ద అదనపు వసూళ్లు చేస్తున్నారు. ఇది మాకు మరో భారం” అని వాపోతున్నారు.వే బ్రిడ్జి నిర్వాహకులు రైతుల నిరసనలను పట్టించుకోకుండా “రేట్లు పెరిగాయి” అనే పేరుతో అదనపు వసూళ్లు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం మీద సంబంధిత అధికారులు దృష్టి సారించాలని, రైతులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.స్థానిక ప్రజలు కూడా దీనిపై స్పందిస్తూ, “ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేట్ల ప్రకారం మాత్రమే వసూళ్లు జరగాలి. ఎవరికీ అదనపు డబ్బులు వసూలు చేసే అధికారం లేదు. ఇలాంటి దందాలను నిలువరించకపోతే రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారు” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు ఈ అంశంపై పరిశీలించి, రైతులపై జరుగుతున్న లూటీని అరికట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.


