 
									 
మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను, పని గంటల పెంపును వ్యతిరేకించండి.
ఏఐటీయూసీ 106 వ వ్యవస్థాపక వేడుకల్లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 31 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
భారతదేశ కార్మికవర్గ పోరాటాల్లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ది ఒక మహోజ్వల పోరాట చరిత్ర “వితౌట్ ఎఐటియుసి హిస్టరీ దేర్ ఈజ్ నో ఇండియన్ వర్కింగ్ క్లాస్ మూమెంట్” అని ఈ దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి మహాసభల్లో సౌహార్దం సందేశాలు ఇస్తూ వాడిన మాటలు అక్షర సత్యాలు, ఎదకోసి, ఎగదోసి అన్న చందాన ఎన్నో పోరాటాలు, ఎన్నో మైలురాళ్ళు 105 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో అడుగడుగునా దర్శనమిస్తాయని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ తెలియచేశారు.
ఏఐటీయూసీ 105 ఏళ్ళు పూర్తి చేసుకుని 106 సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా 106 వ వ్యవస్థాపక దినోత్సవాలను శుక్రవారం ఉదయం విజయనగరం ఎఐటియుసి జిల్లా సమితి ఆధ్వర్యంలో విజయనగరం పి.డబ్ల్యూ.మార్కెట్ లో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఏఐటీయూసీ జెండా ఎగురవేసి ర్యాలీ నిర్మించి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) మన భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నగరంలో ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో కార్మిక గర్జనల నుండి కార్మికుల అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వ కుట్రల నుండి ఎన్నో వీరోచిత కార్యాచరణ నేపథ్యంలో ఏఐటీయూసీ ఆవిర్భవించింది. ప్రధమ అధ్యక్షులుగా లాలాలజపతిరాయ్ ని, ప్రధాన కార్యదర్శి గా వి.యం. పవార్ ని మహాసభ ఎన్నుకున్నాది. ఆ తరువాత కాలంలో పండిట్ జవర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి.వి.గిరి, సరోజినినాయుడు, సి.ఆర్.దాస్ ఇంకా చాలామంది స్వాతంత్ర్యోద్యమ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఏఐటీయూసీ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. 1921లో ఝారియాలో జరిగిన ఏఐటీయూసీ ద్వితీయ మహాసభల్లో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అందరికన్నా ముందే నినదించి మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ మాత్రమే అని తెలిపారు. భారతదేశ స్వతంత్ర పోరాట వేదికగా గుర్తింపు పొందిన భారత జాతీయ కాంగ్రెస్ ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని వ్యతిరేకించింది. ఆ తరువాత స్వతంత్ర పోరాటంలో ఏఐటీయూసీ అగ్రభాగాన నిలబడిపోతుందని ఎనిమిదేళ్ళ తరువాత 1929 సంవత్సరంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రజలందరికీ, స్వేచ్చా, సమానత్వంతో పాటు కార్మికవర్గ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా దేశంలో ఎన్నో పోరాటాలు నడిపిన చరిత్ర ఏఐటీయూసీ కి మాత్రమే ఉందన్నారు. ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం కార్మికవర్గం పై దాడులు, అర్ధాకలి, అణిచివేత నుండి కార్మిక వర్గాన్ని విముక్తి చేస్తూ మరోవైపు వారిని సంఘటితం చేస్తూ దేశ స్వతంత్ర ఉద్యమంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు.నేడు కేంద్రంలో బీజెపీ, రాష్ట్రములో కూటమి ప్రభుత్వాలు కార్మికుల హక్కుల పై మునుపెన్నడూ లేని రీతిలో దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు ఇప్పటివరకు కలగా ఉన్న కార్మిక చట్టాలు మార్పు పైన మోడీ ప్రభుత్వం ప్రధాన దృష్టిని కేంద్రీకరించిందన్నారు. వర్కర్స్ నియామకం తొలగింపుల్లో పూర్తి స్వేచ్ఛను యాజమాన్యాలకు దారాదత్తం చేసే నిర్ణయాలు చేసే కుట్రలో ఉందన్నారు. భారతదేశంలో కార్మిక వర్గం నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి 8 గంటల పని దినాలను పెంచి కార్మిక చట్టాలను రూపుమాపి బడా కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికులని కట్టుబానిసలుగా మార్చే దుర్మార్గాలకి పాల్పడుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను పరిరక్షించేందుకు, కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని బుగత అశోక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కెల్ల సూర్యనారాయణ, పతివాడ శ్రీను, మజ్జి చిన్న, గనివాడ సురేష్, ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు మరియు కార్మికులు పాల్గున్నారు.


