

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
జనం న్యూస్ పిబ్రవరి 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ లో ఈనెల 11 నుండి 13వ తేదీ వరకు జరగనున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరను అధికారులు సమన్వయంతో కృషిచేసి విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. శుక్రవారం అదనపు ఎస్. పి. తో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జాతర కొరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్, భారీ కేడ్లు, త్రాగునీరు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ చర్యలతో పాటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యేక బస్సుల ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.