Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా


బీజేపీ నాయకులు ఇళ్ల సత్యనారాయణ కేంద్ర బడ్జెట్పై మాట్లాడుతూ, ఈ బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తి పరిచేలా ఉందని అన్నారు.కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, పట్టణ త్రాగునీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల నిర్వహణకు రూ.800 కోట్లు కేటాయించడం వల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.157.32 కోట్లు, రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణం కోసం రూ.350 కోట్లు మంజూరు చేయడం ద్వారా వ్యవసాయం, రవాణా రంగాలు బలోపేతం అవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన ఖనిజ వనరులను దృష్టిలో ఉంచుకుని ‘రేర్ ఎర్త్ కారిడార్’ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం శుభపరిణామమని పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడి, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్క, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.