జనం న్యూస్, ఫిబ్రవరి 13 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి: శ్రీనివాస్ రెడ్డి
ఎనభై, తొంభై దశకాలలో టెలివిజన్ ముందు కుటుంబమంతా కూర్చునే రోజులు గుర్తొస్తే… ఆ తెరపై కనిపించే ఓ సౌమ్యమైన ముఖం, చెవుల్లో మోగే ఓ మధురమైన స్వరం వెంటనే గుర్తుకు వస్తాయి. ఆ స్వరం – సరళా మహేశ్వరి. ఇప్పుడు ఆ గళం నిశ్శబ్దమైంది. దూరదర్శన్ వార్తా ప్రపంచంలో ఒక అధ్యాయం ముగిసింది.
ఒక వార్తను వినిపించడం మాత్రమే కాదు, ఆ వార్తను మనసులో నిలిపేలా చెప్పడం ఒక కళ. ఆ కళలో నిపుణురాలు సరళా మహేశ్వరి. ఆమె చదివిన ప్రతి బులెటిన్ వెనుక స్పష్టమైన ఉచ్చారణ, సరళమైన భాష, నిగర్వి నడవడి కనిపించేవి. “ది న్యూస్ రెడ్ బై సరళా మహేశ్వరి” అన్న వాక్యం ఆ కాలంలో అనేక మందికి ఒక మంత్రంలా మారింది.దూరదర్శన్ తెరపై ఆమె ఉనికి ఒక మెరుపు. వార్తలు చదువుతున్నప్పుడు ఆమె స్వరంలో ఒక చరుపు, ఒక మైమరపు ఉండేది. ప్రేక్షకులు కేవలం వార్తలు వినేవారు కాదు – ఆమెను వినడానికి ఎదురు చూసేవారు. వార్తల పట్ల జిజ్ఞాసతో పాటు, ఆ గళాన్ని మరోసారి వినాలనే ఆసక్తి కూడా ఉండేది.
ఆ కాలంలో రీనీ సైమన్, నారంగ్ వంటి ప్రముఖులతో కలిసి సరళా మహేశ్వరి దూరదర్శన్ వీక్షకులకు ఎంతో ఆప్యాయమైన త్రయంలో భాగమయ్యారు. వీరికి సల్మా, ఉషా, నీలం, మంజరి వంటి మరికొందరు తోడై వార్తా ప్రసారాలను మరింత సమృద్ధిగా తీర్చిదిద్దారు. ఆ బృందం ప్రేక్షకుల హృదయాలను అలరించింది, అప్పుడప్పుడు కదిలించింది కూడా.సరళా మహేశ్వరి చదివిన వార్తలు కేవలం సమాచార ప్రసారం మాత్రమే కాదు – అవి ఒక అనుభవం. ఆమె భాషలో సరళత, ఉచ్చారణలో సొగసు, రూపంలో ఆహ్లాదం, వ్యవహారంలో గంభీరత కనిపించేవి. ఒక తరం ఆమె స్వరం వింటూనే పెరిగింది. వార్తల ద్వారా జ్ఞానం పెరిగింది, విజ్ఞానం రెట్టింపైంది.టెలివిజన్ ఛానెళ్ల విప్లవానికి ముందు, ఒకే ఛానల్గా దూరదర్శన్ ఆధిపత్యం చెలాయించిన రోజుల్లో, వార్తలంటే సరళా మహేశ్వరి అనే స్థాయికి ఆమె ఎదిగారు. సంవత్సరాలపాటు ఆమె గళం అనేక గృహాల్లో ప్రతిధ్వనించింది.ఆమె లేని లోటు దూరదర్శన్ వార్తా ప్రపంచానికి మాత్రమే కాదు, ఒక తరం జ్ఞాపకాలకు కూడా పెద్ద నష్టమే. ఆమె స్వరం ఇక వినిపించకపోయినా, ఆ గళం మిగిల్చిన మాధుర్యం, ఆత్మీయత ఎప్పటికీ మసకవదు.సరళా మహేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ… ఆమె అభిమానులకు, కుటుంబ సభ్యులకు జనం న్యూస్ తరఫున ప్రగాఢ సానుభూతి.


