Listen to this article

జనం న్యూస్ 26 మార్చి వికారాబాద్ జిల్లా

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, ఆకస్మికంగా తలెత్తే మతపరమైన సమస్యలను (Communal Issues) సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఒకరోజు ప్రత్యేక “యాంటీ డిసెక్రేషన్ డ్రిల్” (Anti-Desecration Drill) శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ శిక్షణలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ సిబ్బందితో పాటు జిల్లాలోని ఉన్నత పోలీసు అధికారులు,డీఎస్పీ లు,ఎస్.ఐ లు, సీఐ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో అల్లర్లు సృష్టించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మతపరమైన ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు. శిక్షణలో భాగంగా, క్షేత్రస్థాయిలో అల్లర్లు జరిగినప్పుడు పోలీసులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలు జాగ్రత్తలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అనుసరించాల్సిన వ్యూహాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ద్వారా వివరించారు. ముఖ్యంగా అల్లర్లు తలెత్తినప్పుడు సమయంలో “ఏమి చేయాలి (Dos) – ఏమి చేయకూడదు (Don’ts)” అనే అంశాలపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను అరికట్టడం, మరియు పరిస్థితిని అదుపులోకి తెచ్చే క్రమంలో సంయమనం పాటిస్తూనే కఠినంగా వ్యవహరించడం ఎలాగో వివరించారు. బ్లూ కోల్ట్స్ మరియు పెట్రో కార్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి అతి తక్కువ సమయంలో చేరుకుని, పరిస్థితిని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు వివరించాలని ఎస్పీ ఆదేశించారు.అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన డెమో (Demo) కార్యక్రమాన్ని ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. ఆకస్మికంగా ఏదైనా మతపరమైన సున్నితమైన అంశం తలెత్తినప్పుడు, గుంపులను ఎలా నియంత్రించాలి, పరిసరాలను ఎలా భద్రపరచాలి అనే అంశాలపై సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరిస్తేనే శాంతిభద్రతలు కాపాడబడతాయి. ఇలాంటి శిక్షణలు సిబ్బందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని” పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, DTC డీఎస్పీ శ్రీనివాసులు, DCRB డీఎస్పీ జానయ్య, వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఏ ఆర్ డీఎస్పీ వీరేష్,సీఐ లు, ఎస్.ఐలు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది