Listen to this article

జనం న్యూస్ 14 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విశాఖపట్టణం మధురవాడ పరదేశిపాలెం నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. చదువుపై ఒత్తిడికి గురైన ఓ విద్యార్థి కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు: ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంద్ర వంశీ (17), ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్ ప్రాంతానికి చెందిన విద్యార్థి. చదువుపై సరైన దృష్టి పెట్టడం లేదని లెక్చరర్ మందలించడంతో, మనస్తాపానికి గురైన చంద్ర వంశీ, కళాశాల భవనంపై నుంచి దూకి తన ప్రాణాలను కోల్పోయాడు. ఆందోళన – ఉద్రిక్తత : ఈ ఘటనపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) కార్యకర్తలు కళాశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ ఆందోళన చేపట్టారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో, పీఎంపాలెం పోలీసులు SFI నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై విమర్శలు : కేసు విషయంలో పోలీసులు సరిగ్గా దర్యాప్తు జరపడం లేదని, నీరు గారుస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడిని మరోసారి గుర్తుచేస్తుంది. చదువు ఒత్తిడి, అకడమిక్ ప్రెజర్ విషయంలో కాలేజీలు, లెక్చరర్లు మరింత జాగ్రత్త వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.